News

ఉత్తరప్రదేశ్ కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం

295views

మహా కుంభమేళాకు సర్వం సిద్ధమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వేదికగా అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం జరగనుంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ మహా కుంభమేళా జరగనుంది. 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే.. కుంభమేళాకు కోట్లాది మంది తరలివెళ్తుంటారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక కుంభమేళా కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా భాగం కానుంది. ప్రతిష్టాత్మక కుంభమేళా కార్యక్రమంలో పాల్గొని దేశవ్యాప్తంగా హిందు ధర్మ ప్రచారంలో టీటీడీ కూడా భాగస్వామ్యం పంచుకోనుంది. కుంభమేళాను పురస్కరించుకుని ప్రయాగ్‌రాజ్‌లో టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా టీటీడీ జేఈఓ గౌతమి ఉత్తర ప్రదేశ్‌లో కుంభమేళా అధికారి విజయ్‌ కిరణ్ ఆనంద్‌ను కలిశారు.

ప్రయాగ్‌రాజ్‌లో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు కోసం కుంభమేళా అధికారులు రెండున్నర ఎకరాల స్థలం కేటాయింటారు. ఆరో సెక్టార్‌లో కేటాయించిన ఈ స్థలాన్నిటీటీడీ జేఈవో గౌతమి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం పలు సూచనలు చేశారు. కుంభమేళాకు తరలివచ్చే ఉత్తరాది భక్తులను దృష్టిలోఉంచుకుని శ్రీవారి నమూనా ఆలయం వద్ద ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కోట్ల మంది తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.