
నానాటికీ ఆలయాలకు(Temples) వచ్చే యువత సంఖ్య తగ్గిపోతోందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరువనంతపురంలోని శ్రీ ఉదియనూర్ దేవీ ఆలయంలో ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నయ్యర్ చేతుల మీదుగా ఆయన శనివారం ఓ అవార్డు అందుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..”ఆలయాలు.. వయసుపైబడిన వారు వచ్చి ఆరాధనలు చేసుకోవడానికే కాదు. సమాజాన్ని మార్చే శక్తి గుడులకు ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలకు యువతను రప్పించాలి. నా అవార్డు ప్రదాన కార్యక్రమంలో వారు ఎక్కువగా కనిపించట్లేదు. వారిని ఆకర్షించడానికి ఆలయాల్లో గ్రంథాలయాలు ఎందుకు పెట్టకూడదు?
పుస్తకాలు చదివే ఆసక్తి ఉన్నవారు ఆలయాల బాట పడతారు. పుస్తకాలు చదివి జ్ఞానసంపద పెంచుకుని, ఉన్నతమైన జీవితానికి బాటలు వేసుకుంటారు. ఆలయ సిబ్బంది లైబ్రరీలను అందుబాటులోకి తెస్తే ఎన్నో మార్పులు చూడవచ్చు” అని సోమనాథ్ ఆసక్తికర సలహా ఇచ్చారు.





