ArticlesNews

కాఠిన్యమూ హింసే

481views

ఉద్వేగం కలిగించకుండా, బాధించకుండా, ప్రియంగా మాట్లాడటం వాచిక తపస్సని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రబోధించాడు. మాటకి అధిదేవత ‘అగ్ని’ అనేది పురాణ వచనం. అగ్ని ఎంత ఉపయోగకరమో, అంత ప్రమాదకరం కూడా! కనుక వాక్కును నిప్పులా ఎంతో పదిలంగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకునే విజ్ఞత ఉండాలి. యుద్ధంలో శరీరానికి తగిలిన బాణాలను ఎలాగైనా తొలగించుకోవచ్చు. కానీ మనసును గాయపరిచే కఠినమైన మాటల బాణాలను ఏ ఉపాయంతోనూ తొలగించలేమని మహాభారతం కూడా హితవు పలికింది. మనసు నొచ్చుకునేలా మాట్లాడటం హింసతో సమానమని హెచ్చరించింది. మన సభ్యత, సంస్కారం మాట్లాడే తీరులోనే బయటపడతాయని స్పష్టం చేసింది. దుర్భాషలాడటం, కసురుకోవటం, పెళుసుతనం, సూటిపోటీలు- ఇవన్నీ వాచిక తపస్సుకు ఆటంకాలు. ‘ఇతరుల మనసు నొచ్చుకునేలా భాషించకూడదు. ఆ ధోరణిని కొనసాగిస్తే చివరకు అదే నీ స్వభావం అయిపోతుంది. సున్నితత్వాన్ని కోల్పోతే నీ మాటలకు హద్దూ అదుపూ లేకుండా పోతుంది’ అన్నారు జనని శారదాదేవి. ‘మాటపై అదుపు లేదంటే, మనపై మనకు అదుపులేదని అర్థం. అది రాక్షసత్వానికి నిదర్శనం. కటువుగా మాట్లాడే వాళ్లు వేటగాళ్లతో సమానం. మానసికంగా బాధించడమూ హింసే. దానికి శిక్ష తప్పదు’ అని హెచ్చరిస్తున్నాయి ధార్మిక గ్రంథాలు.