
పూరీ శ్రీక్షేత్రవాసుని చందనయాత్ర సమీపించింది. ఈ నెల 10న అక్షయ తృతీయ పర్వదినం నుంచి పురుషోత్తముని 21 రోజుల చందన యాత్ర, జలక్రీడలకు తెర లేస్తుంది. దీనికి వేదికయ్యే నరేంద్ర పుష్కరిణి అందంగా ముస్తాబవుతోంది. అక్షయ తృతీయ నుంచి నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాల తయారీ పనులకు శుభారంభం జరగనుంది. దీంతో విశ్వప్రసిద్ధ రథయాత్రకు పూరీ దివ్యధామం ప్రాధాన్యం సంతరించుకోనుంది.
పూరీ చందన యాత్ర వేడుకలు 42 రోజులు నిర్వహిస్తారు. శ్రీక్షేత్రం వెలుపల నరేంద్ర పుష్కరిణిలో ఏర్పాటయ్యే 21 రోజుల వేడుకలను భక్తులు చూడొచ్చు. తర్వాత ఆలయం లోపల మరో 21 రోజులు జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు చందన లేపనం చేయనున్నారు. జలక్రీడలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.అక్షయ తృతీయ నుంచి ప్రారంభమయ్యే స్వామి చందన యాత్ర, జలక్రీడల నరేంద్ర పుష్కరిణికి రంగులు, ముస్తాబు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నంద, భద్ర పడవలనూ సిద్ధం చేస్తున్నారు.





