News

కశ్మీర్‌లో వాయుసేన జవాన్ల కాన్వాయ్‌పై కాల్పులు

70views

జమ్మూకాశ్మీర్ లోని పూంఛ్‌ జిల్లాలో భారత వాయుసేన జవాన్ల వాహనశ్రేణిపై ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. బలగాలు సనాయ్‌టోప్‌లోని శిబిరానికి తిరిగొస్తుండగా సురాన్‌కోటె పరిధిలోని షాసితార్‌ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.15 గంటలకు ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఒక వాహనం విండ్‌ స్కీన్‌పై డజనుకుపైగా బుల్లెట్ల దాడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఏకే రకం రైఫిళ్లతో దాడి చేసిన ఉగ్రవాదులు తర్వాత సమీప అడవిలోకి పారిపోయారు.

గాయపడిన జవాన్లకు ఉధమ్‌పూర్‌లోని కమాండ్‌ ఆస్పత్రిలో చికిత్సచేస్తున్నారు. దాడి విషయం తెల్సి అప్రమత్తమైన సైన్యం, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రైఫిల్స్‌ బృందాలు అణువణువునా గాలిస్తున్నాయి. కాన్వాయ్‌ సురక్షితంగా ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని వాయుసేన ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేసింది.