ArticlesNews

మహర్షి.. మయూరం

1.5kviews

బరోడా మహారాణి బహూకరించిన తెల్లనెమలిని రమణ మహర్షి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. తన ఆసనం పక్కనే ఆ మయూరానికి గూడు కట్టించి, ‘ఒరే మాధవా!’ అంటూ ప్రేమగా పిలిచేవారు. వారిద్దరి అనుబంధాన్ని చూసి అందరూ ముచ్చటపడేవారు. ఒక భక్తుడైతే ఎంతో ప్రభావితుడై, ఆ నెమలిపై సంస్కృతంలో 8 శ్లోకాలతో ‘మయూరాష్టకమ్‌’ అంటూ రాశారు.

నెమలి నేర్పే పాఠం
తన వద్దనున్న మయూరాన్ని ఆలించి, లాలించడమే కాకుండా దాని ద్వారా భక్తులకు ఎన్నో ఆధ్యాత్మిక సందేశాల్నీ ఇచ్చారు రమణులు. అందులో భాగంగా ఓ సందర్భంలో దాన్ని ప్రేమగా నిమురుతూ భక్తులతో ‘నీలిరంగు నెమళ్లు చిత్ర విచిత్ర వర్ణాలను ప్రదర్శిస్తూ ఎంత మనోహరంగా ఉన్నా.. తెల్లనెమలి ప్రత్యేకతే వేరు! శ్వేతవర్ణం సత్త్వ గుణానికి ప్రతీక. అందుకే పవిత్రత, పరిశుద్ధతలతో ప్రకాశిస్తుంది. నిజానికి అన్ని వర్ణాలూ పుట్టేది తెలుపులోంచే! పరబ్రహ్మకు ఏ వర్ణమూ లేకపోయినా, వ్యవహారంలో శ్వేత వర్ణంతో పోలుస్తారు. నెమళ్లు జన్మతః ఏక వర్ణంగానే ఉంటాయి. కానీ ఎదిగే కొద్దీ రకరకాల రంగులను సంతరించుకుంటాయి. మన మనసు కూడా అంతే! అప్పుడే పుట్టిన శిశువు ఎటువంటి గుణాలూ, వైవిధ్యాలూ లేకుండా ఏకరీతిగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ అనేకత్వాన్నీ, నానాత్వాన్నీ సంతరించుకుంటుంది. విశాల ప్రపంచాన్ని సృష్టించుకుని సుఖదుఃఖాలకు లోనవుతుంది. శ్వేతమయూరం మాత్రం పుట్టీ, పెరిగీ, గిట్టేదాకా అదే రంగుతో ఉండి, మార్పులేని స్వస్థితిని ప్రదర్శిస్తుంది’ అన్నారు. అంతగా మహర్షి మనసు దోచింది కనుకనే ఆయన నిర్యాణసమయంలో వారి గది పైకప్పు మీద నిలిచి, దుఃఖపూరితమైన ధ్వని చేస్తూ హృదయ విదారకంగా విలపించిందా మయూరం.