
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యూఎసీసీఐఆర్ ఎఫ్) ఇచ్చిన నివేదిక పక్షపాతంతో కూడుకున్నదని స్పష్టంచేసింది.’ఇది మా దేశ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే. మా దేశానికి వ్యతిరేకంగా చేసే ప్రచారమే. మరో రూపంలో చేసే దుష్ప్రచారానికి ఈ నివేదిక ఒక తార్కాణం’ అని భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘యూఎసీసీఐఆర్ఎఫ్ అనేది పక్షపాతంతో వ్యవహరించే సంస్థ. రాజ కీయ ఎజెండాతోనే అది పని చేస్తుంది. భారత్ లోని విభిన్న, బహుళార్థ, ప్రజాస్వామ్య విలువలు ఆ సంస్థకు అర్థం కావు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియలో ఇలా అమెరికా సంస్థ జోక్యం చేసుకోవడం ఎన్నటికీ విజయం సాధించదు’ అని జైశ్వాల్ పేర్కొన్నారు.





