News

కాశ్మీర్‌లోని ఆలయం.. 524 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణం

452views

అఖండ భారత దేశంలో అనేక అందమైన పురాతన దేవాలయాలున్నాయి. వాటిల్లో కొన్నిటిని విదేశీయులు దండయాత్ర చేసి నాశనం చేయడమే కాదు దొరికినంత సంపదను దోచుకున్నారు. అలాంటి పురాతన దేవాలయాల్లో ఒకటి జమ్మూకశ్మీర్ లోని సూర్య దేవాలయం. ఇది దేశంలోనే అత్యంత పురాతన దేవాలయం దీనిని మళ్ళీ సుందరంగా తీర్చిదిద్దాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అనంత్‌నాగ్‌లోని అత్యంత పురాతన ఈ సూర్య దేవాలయం త్వరలో పునరుద్ధరించబడుతుంది. త్వరలో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. మార్తాండ్ ఆలయాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. హిందూ, ముస్లిం మతాలకు చెందిన వారు కూడా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టారు.

ఈ ఆలయం శ్రీనగర్ నుంచి 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పట్లో జమ్మూ కశ్మీర్ ని పాలించిన కరకోట రాజవంశానికి చెందిన గొప్ప రాజు లలితాదిత్య ముక్తాపిడాడు క్రీ.శ.750లో ఈ సూర్య దేవాలయాన్ని నిర్మించాడు.

ఆలయాన్ని ఏ శైలిలో నిర్మించారంటే?
ఈ సూర్య దేవాలయం కాశ్మీరీ శిల్పకళా సౌందర్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణంలో కంధార, చైనీస్, గుప్త రోమన్ శైలులు ఉపయోగించారు. ఈ ఆలయం 270 అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ దేవాలయం వెడల్పు 180 అడుగులు. మార్తాండ్ దేవాలయం ASI రక్షిత ప్రదేశాలలో ఒకటి. అయితే ఈ ఆలయంలో నేటికీ పూజలు జరగవు. అయితే గుజరాత్, ఒడిశాలోని సూర్య దేవాలయాలు కూడా ASI రక్షిత దేవాలయాలు. అయినప్పటికీ ఈ సూర్య దేవాలయాలలో పూజలను చేస్తారు.