News

కాళ్లు కడికి ‘కన్యాపూజ’ చేసిన యోగి ఆదిత్యనాథ్

242views

శారదీయ నవరాత్రి ‘మహర్నవమి’ పర్వదినం సందర్భంగా ఏటా సంప్రదాయబద్ధంగా చేసే ‘కన్యాపూజ’ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోరఖ్‌నాథ్ ఆలయంలో నవరాత్రి తొమ్మిదో రోజు సందర్భంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో తొమ్మిది మంది చిన్నారులకు కాళ్లు కడిగి వారికి తిలకం దిద్దారు. అనంతరం హారతి ఇచ్చి వారికి స్వయంగా ప్రసాదాలను తినిపించారు. వారికి దక్షిణలు, బహుమతులు ఇచ్చి, ఆశీస్సులు అందజేశారు.

‘దుర్గా సప్తశతి’ మంత్రోచ్ఛారణల మధ్య ‘చునరి’తో పిల్లలను అలంకరిస్తూ నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు, చిన్నారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఘంటానాదాల మధ్య అత్యంత వేడుకగా పూజా కార్యక్రమాలు సాగాయి. గోరఖ్‌నాథ్ ఆలయ ప్రధాన పూజారి యోగి కమల్ నాథ్, కాశీ నుంచి విచ్చేసిన మహామండలేశ్వర్ సంతోష్ దాస్ సతువా బాబా, కలిబరి మహంత్ రవీంద్ర దాస్, గోరఖ్‌నాథ్ ఆలయానికి చెందిన ఆచార్య రామానుజ త్రిపాఠి వేదిక్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.