
పశ్చిమబెంగాల్లోని సందేశ్ ఖాలీలో దౌర్జన్యాలకు సంబంధించి అనేక ఉదంతాలను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) తన విచారణలో గుర్తించింది. ఇలాంటి ఘటనలను నివారించడంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పేర్కొంది. సర్వత్రా వ్యాపించిన ప్రతీకార భయం వంటి పరిస్థితులు బాధితులు తమ బాధలు వెల్లడించకుండా అడ్డుగోడలా నిలిచాయని ఎన్హెచ్ఆర్సీ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు అనేక సిఫార్సులు చేసిన కమిషన్ వాటిలోని ప్రతి ఒక్కదానిపైనా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఎనిమిది వారాల్లోగా తెలియజేయాలని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నివేదికను ఎన్హెచ్ఆర్సీ వెబ్సైట్లో పెట్టామని, పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు కూడా పంపినట్లు తెలిపింది. భయంతో కూడిన వాతావరణం బాధితులపైనే కాకుండా, నిందితుల చేతిలో తమ తల్లిదండ్రులు పడిన ఇబ్బందులను నిరంతరం చూస్తే వారి పిల్లల పెరుగుదల, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో చట్టం, అధికారులపై మళ్లీ అక్కడి ప్రజల్లో విశ్వాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని.. సాక్షులకు రక్షణ, ఫిర్యాదుల పరిష్కారానికి భరోసా అందించాలని కోరింది.





