
చంద్రయాన్-2 ప్రయోగానికి అంతా రెడీ. కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి. తెమలడం లేదు, తేలడం లేదు. లెక్క తెగడమే లేదు. 900 కోట్ల ప్రాజెక్టు. కోట్ల మంది భారతీయుల ఆశలు. ప్రపంచం మొత్తానికి దానిమీదే కన్ను. ఇస్రో ఛైర్మన్కు ఓ సీనియర్ సైంటిస్టు ఓ సలహా ఇచ్చాడు. ఇస్రో శివన్ కూడా ప్రతిదీ వినే తరహా. దేన్నీ తేలికగా తీసేసే రకం కాదు. ఆ సలహా ఏమిటంటే? ‘పూరి శంకరాచార్యను కలుద్దాం సార్, ఆయన ఏమైనా పరిష్కారం చెప్పవచ్చు…’ శివన్ ఓ క్షణం విస్తుపోయాడు. “ఆధునిక గణితవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్ర పరిశోధకులకే చేతకానిది ఓ కాషాయగుడ్డల సన్యాసికి ఏం తెలుసు?” అని. కానీ తన మనసులో భావాన్ని బయటికి వెల్లడించలేదు. వాళ్లు వెళ్లలేదు కానీ, స్వామివారినే శ్రీహరికోటను రమ్మని ఆహ్వానించారు. ఆయన వచ్చాడు, చూశాడు. ఆ లెక్కను చిటికెలో సాల్వ్ చేసేశాడు శంకరాచార్య అలియాస్ నిశ్చలానంద సరస్వతి. ఆయన ఎదుట అక్షరాలా భక్తిభావంతో సాగిలపడ్డాడు ఇస్రో చీఫ్. ఆ తరువాత కొద్దిరోజులకే చంద్రయాన్-2 మన పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఖగోళంలోకి చంద్రుడి వైపు దూసుకుపోయింది.

“అబ్బే, ఏమాత్రం నమ్మేట్టుగా లేదు, ఉత్త ఫేక్” అని కొట్టేసేవాళ్లు బోలెడు మంది ఉంటారు కదా ఈ వార్తను? కానీ ఈ వార్త నిజమే. కాకపోతే మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇలాంటివి పట్టవు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయ్. ఈ స్వామి పూరి శంకరాచార్య నంబర్ 145. ఈయన 143వ శంకరాచార్య శ్రీ భారతీ కృష్ణ తీర్థకు ప్రియమైన శిష్యుడు. శ్రీ భారతీ కృష్ణ తీర్థ వేదగణితంలో దిట్ట. ఆధునిక గణితం వల్ల కాని అనేకానేక సంక్లిష్టమైన సూత్రాల్ని, సమీకరణాల్ని ఇట్టే సాల్వ్ చేసేవాడు. ఈ నిశ్చలానంద కూడా ఆయన దగ్గర నేర్చుకుని, పాత వేదగణిత గ్రంథాల్ని ఔపోసన పట్టి, తన జ్ఞానానికి మరింత మెరుగుపెట్టుకున్నాడు.
ఆహారానికి, భాషకు, మందులకు, ఆహార్యానికీ, అలవాట్లకూ మతాన్ని రుద్దినట్టుగా ఈ గణితానికి మతాన్ని రుద్దకండి. లెక్కలంటే లెక్కలే. ఆధునిక గణితం పోకడ వేరు, వేదగణితం పోకడ వేరు. రెండూ సొల్యూషన్సే చూపిస్తాయి. కాకపోతే వేదగణితం సులభంగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఆధునిక గణితం కాస్త సంక్లిష్టంగా ఉంటుంది. ‘‘ఇందులో వింత ఏమీ లేదు. ఇదేమీ మాయ కాదు, లీల కాదు, మహత్తు అసలే కాదు. వేల ఏళ్ల క్రితమే భారతీయ ఋషులకు లెక్కలు, జ్యోతిష్యం, క్షిపణి పరిజ్ఞానం, ఖగోళ జ్ఞానం, గగనయానంపై బ్రహ్మాండమైన విద్వత్తు ఉంది. మన పురాణాల్లో, భగవద్గీతలో బోలెడు అంశాలు దొరుకుతాయి. నిశ్చలానంద సరస్వతి ఆధ్యాత్మక గురువే కాదు, వేదగణితంలో బోలెడంత సాధన చేశాడు. వేద గణితంపైన 11 పుస్తకాలు రాశాడు. చాలా మంది విదేశీ గణిత పరిశోధకులు స్వామితో టచ్లో ఉంటారు. సందేహాలకు వేదగణితంలో పరిష్కారాలు వెతుక్కుంటారు.’’ అంటున్నాడు ఈ శంకరాచార్యుడి గోవర్ధన పీఠం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్ రత్తా.
నిజానికి నిశ్చలానందుడికి ఇస్రో స్పేస్ సైన్స్తో పరిచయం కొత్తదేమీ కాదు. చాలాసార్లు తను ఇస్రో లెక్కలకు సాయం చేశాడు. రెండేళ్ల క్రితం అహ్మదాబాద్ స్పేస్ రీసెర్చ్ స్టేషన్కు వెళ్లి దాదాపు 1000 మంది సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్లను ఉద్దేశించి ప్రసంగించాడు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఏడాది క్రితం మేనేజ్మెంట్ పాఠాలు కూడా చెప్పాడు. సో, స్వామి అనగానే కాషాయాలు ఉపవాసాలు, పూజలు, ధ్యానాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలే అనుకోకండి. ఇదుగో, ఈ నిశ్చలానందులూ ఉంటారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి పురాతన జ్ఞానాన్ని అద్ది సుసంపన్నం చేస్తారు. తమ చుట్టూ ఛాందసాల మడి గీతలు గీసుకుని, వాటిల్లో బందీలుగా ఉండరు. విభిన్నరంగాల్లో ఇదుగో ఇలా తళుక్కుమంటారు. అవసరమైన వేళల్లో..!!





