News

పర్యావరణ మార్పులతో గంగా, బ్రహ్మపుత్ర బేసిన్‌లపై ప్రతికూల ప్రభావం

294views

పర్యావరణంలో ప్రతికూల మార్పుల ప్రభావం దక్షిణాసియాలో అత్యంత కీలకమైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాలపై పడుతోందని తాజా నివేదిక ఒకటి తెలిపింది. సత్వరం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దాదాపు వంద కోట్లమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నివేదిక ప్రకారం- హిందుకుష్‌ హిమాలయాల్లోని మంచు, హిమానీనదాలు, అక్కడ కురిసే వర్షపాతమే ఆసియాలోని 10 అతిపెద్ద నదీ వ్యవస్థలకు మూలాధారాలు. గంగా బేసిన్‌ వల్ల భారత ఉపఖండంలో 60 కోట్లకు పైగా మంది ప్రయోజనాలు పొందుతుంటారు. అయితే పారిశ్రామికీకరణ, నగరీకరణ చాలా వేగంగా చోటుచేసుకుంటుండటంతోపాటు వ్యవసాయ విధానాల్లో అనుచిత మార్పుల కారణంగా ఈ నదీ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. నదీజలాల్లోకి పారిశ్రామిక వ్యర్థాలను ఇష్టారీతిన విడుదల చేస్తుండటం మానవ, పర్యావరణ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. వర్షాకాలంలో వరద విలయాలు, వేసవిలో తీవ్రస్థాయి నీటి కొరత కనిపిస్తున్నాయి. భారత్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, చైనాల్లో 26.8 కోట్లకుపైగా మందికి జీవరేఖగా భావించే సింధూ నది విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పర్యావరణ మార్పులతోపాటు డ్యాంల నిర్మాణం, అభివృద్ధి పనులు మితిమీరుతుండటం వల్ల బ్రహ్మపుత్ర బేసిన్‌లోనూ (ముఖ్యంగా దిగువ బేసిన్‌లో) వరదలు, కరవు ముప్పు పెరుగుతోంది.