
ఏకశిలపై వెలసిన ఆధ్యాత్మిక నగరి.. అందాల పురి.. ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట కోదండ రామాలయం కొత్త కళతో మిలమిలా మెరిసిపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్టకు అధికారిక గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.
సుమనోహర మాడవీధులు, సుందర ఉద్యానవనాలతో అజరామర కోవెలై విరాజిల్లుతోంది.2015 సెపె్టంబరు 9న ఆలయాన్ని టీటీడీలో విలీనం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో సుమారు రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రధానంగా శాశ్వత కల్యాణ మండపంతోపాటు చుట్టూ ప్రహరీ నిర్మాణం, భక్తులకు విశ్రాంతి గదులు, వీవీఐపీల అతిథి గృహాలు, కొండపై పార్వేట మండపం, పుష్కరిణి, ఆలయ సమీపంలో రామసేతు కోనేరు ఆధునికీకరణ, రామాలయం చుట్టూ మాడవీధుల నిర్మాణాలు జరిగాయి. పచ్చదనంతో కూడిన ఉద్యాన వనాలతో కోవెల కొత్త అందాలు సంతరించుకుంది.
ఆలయంలో ప్రత్యేకమైన బండరాయితో చప్టా ఏర్పాటైంది. గుడి వెలుపల మండపం నిర్మితమైంది. నూతన రథం సమకూరింది. ఆలయం చుట్టూ ఆక్రమణలు తొలగించారు. కొత్త రోడ్ల నిర్మాణాలతో ఏకశిలానగరం ముగ్ధమనోహరమై ఆకర్షిస్తోంది. క్షేత్రంలో జాంబవంతుడు, పోతన, హనుమంతుని విగ్రహాల ఏర్పాటుకూ వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సోమశిల నుంచి ఒంటిమిట్ట చెరువుకు పైపులైన్ ద్వారా నీటిని అందించేలా చేపట్టిన పనులూ పూర్తయ్యాయి.
పౌర్ణమి వెలుగులో స్వామి కల్యాణం
ఒంటిమిట్టలో ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కోదండ రాముని కల్యాణ ఘట్టం పౌర్ణమి వెన్నెల్లో చంద్రుడి సాక్షిగా నిర్వహించడం ఆనవాయితీ. గతంలో కల్యాణ వేదిక అందుబాటులోలేక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సుమారు 60 ఎకరాల విస్త్రీర్ణంలో కల్యాణ వేదికకు స్థలాన్ని కేటాయించడంతోపాటు అందులో శాశ్వత మండప నిర్మాణాలు పూర్తి చేయడంతో ఏటా స్వామి కల్యాణం నిర్వహిస్తూ వస్తున్నారు. టీటీడీ ఆ«ధ్వర్యంలో మధ్యాహ్న సమయంలో భక్తులకు నిత్యాన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. రెండో శనివారం తిరుమల లడ్డూ ప్రసాదాన్నీ విక్రయిస్తున్నారు.
అద్భుత క్షేత్రమైంది
ఈ రామాలయం టీటీడీ ఆధ్వర్యంలో అద్భుత క్షేత్రంగా ఆవిష్కృతమైంది. భక్తులకు కావాల్సిన విడిది గృహం సమకూరింది. స్వామి శాశ్వత కల్యాణ వేదిక నిర్మితమైంది. పచ్చని నందన వనాలు కనువిందు చేస్తున్నాయి. వీవీఐపీ బిల్డింగ్, అన్నప్రసాద కేంద్రం, నూతనంగా నిర్మించిన పార్వేటి మండపంతో ఆలయం అభివృద్ధి బాటపట్టింది. పుష్కరిణి, రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలవ రాతి బండలు, రామతీర్థం భక్తులను ఆకట్టు్టకుంటున్నాయి. – నటేష్ బాబు, డిప్యూటీ ఈఓ, ఒంటిమిట్ట





