News

స్వదేశీ శక్తిని చాటిన భారీ సైనిక విన్యాసాలు

281views

మళ్లీ అణుపరీక్ష జరగలేదు.. కానీ రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ప్రాంతం దద్దరిల్లింది. శత్రు క్షిపణులేవీ సరిహద్దులు దాటి రాలేదు. కానీ, ఎడారి ఇసుక ఆకాశాన్నంటింది. యుద్ధవిమానాలు, ట్యాంకుల గర్జనలు, నౌకాదళ మెరుపు దాడులు, రాకెట్‌ ప్రయోగాలతో ఆ ప్రాంతం.. యుద్ధక్షేత్రాన్ని తలపించింది. ప్రత్యర్థుల గుండెల్లో దడపుట్టించేలా ‘భారత్‌ శక్తి’ పేరుతో మంగళవారం మన త్రివిధ దళాలు నిర్వహించిన విన్యాసాల్లో ఆవిష్కృతమైన దృశ్యాలివి. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా దేశంలో రూపొందించిన అత్యాధునిక ఆయుధాల పాటవాన్ని ఇందులో ప్రదర్శించారు. ప్రత్యర్థి కయ్యానికి కాలుదువ్వితే.. మన త్రివిధ దళాలు ఎలా సమన్వయంతో పనిచేస్తాయన్నది ఈ విన్యాసాలు కళ్లకు కట్టాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండే, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 50 నిమిషాల పాటు ఒళ్లు గగుర్పొడిచేలా ఈ విన్యాసాలు జరిగాయి.

యుద్ధాన్ని తలపించేలా..

  • ఊహాజనిత శత్రుదేశాన్ని తుత్తునియలు చేయాలన్న ఆదేశాల మేరకు త్రివిధ దళాలు ముందుకు దూకాయి.
  • నిఘా ఉపగ్రహాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ముందుగానే 8 లక్ష్యాలను గుర్తించారు. వాటిపై తొలుత తేజస్‌ యుద్ధవిమానం బాంబులు కురిపించింది. ఈలోపు పినాక రాకెట్లు.. మరికొన్ని శత్రు శిబిరాలపై విరుచుకుపడ్డాయి.
  • శత్రు బలగాల ఆయుధాల వివరాలు.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘స్వాతి’ రాడార్‌ వ్యవస్థ నుంచి రావడం మొదలైంది. దీని ఆధారంగా శత్రు యుద్ధట్యాంకులపైకి నాగ్‌ మిసైల్‌ క్యారియర్‌ (నామికా).. ట్యాంకు విధ్వంసక క్షిపణులను ప్రయోగించింది. ఇదే సమయంలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ దూసుకొచ్చి.. శత్రు ఆయుధాగారాలు, చమురు డిపోలు లక్ష్యంగా రాకెట్ల వర్షం కురిపించింది. ఈ దాడి నుంచి తేరుకునేలోపే ప్రత్యర్థిపై ‘హన్స్‌’ డ్రోన్ల దాడి మొదలైంది. అవి పదుల సంఖ్యలో శత్రు గగనతలంలోకి దూసుకొచ్చాయి. బంకర్లు, సమాచార వ్యవస్థలను నాశనం చేశాయి. తేరుకున్న శత్రుశిబిరం యుద్ధవిమానాలతో దాడికి దిగింది. దీన్ని ముందే గుర్తించిన భారత వాయుసేన రాడార్లు.. విమాన విధ్వంసక ఆయుధాల సాయంతో వాటిని మధ్యలోనే కూల్చేశాయి. ప్రత్యర్థి డ్రోన్లను మన యాంటీడ్రోన్‌ వ్యవస్థ.. లేజర్లతో కూల్చేసింది. ఈలోపు టి-70 యుద్దట్యాంకులు ముందుకు ఉరికాయి. ఆకాశం నుంచి పోరు ఎంతసేపు జరిగినా అంతిమంగా భూతల యుద్ధం ద్వారా సైనికులు రంగప్రవేశం చేసి, యుద్ధక్షేత్రాన్ని తమ అదుపులోకి తెచ్చుకుంటేనే విజయం సాధించినట్లు. అందుకే హెలికాప్టర్‌ ద్వారా.. ప్రత్యేకంగా రూపొందించిన వాహనాన్ని నౌకాదళ మెరైన్‌ కమాండోల (మార్కోస్‌)తో సహా రణరంగంలోకి జారవిడిచారు.
  • ఈ వాహనం ద్వారా వేగంగా శత్రుశిబిరం వైపు దూసుకెళ్లిన సైనికులు.. ముఖాముఖి యుద్ధానికి దిగారు. ఈలోపు మరికొన్ని వాహనాలతో పెద్దఎత్తున బలగాలు అక్కడికి చేరుకున్నాయి. త్రీడీ బంకర్లు రూపొందించి తమవద్ద ఉన్న తుపాకులతో విజృంభించారు. మందుగుండు సామగ్రి నిండుకుంటే.. వాటిని డ్రోన్ల ద్వారా తెప్పించుకున్నారు.
  • ఈ ‘పోరు’లో రోబోటిక్‌ మ్యూల్‌ (గాడిద లాంటి యంత్రం) ద్వారా సరకులు సరఫరా చేశారు. అప్పటికప్పుడు వంతెనలు నిర్మించారు.
  • అదృశ్య దళం అండతో…
    ఆధునిక యుద్ధతంత్రంలోకి ఓ ‘అదృశ్యశక్తి’ చేరింది. నిఘా ఉపగ్రహాలు, ద్రోన్లు, అవి అందించే సమాచారం ఆధారంగా కృత్రిమ మేధ (ఏఐ)తో అప్పటికప్పుడు వ్యూహాల్లో మార్పులు చేస్తుంటారు. దేశాలు.. తమ ఆయుధాగారాలు, వ్యూహాత్మక స్థావరాలు, చమురు నిల్వ కేంద్రాలను శత్రు ఉపగ్రహాలు గుర్తుపట్టకుండా చూడటానికి వాటి రూపురేఖల్లో మార్పులు చేస్తుంటాయి. మన ఉపగ్రహాలు, డ్రోన్ల ద్వారా అందిన సమాచారాన్ని ఏఐతో విశ్లేషిస్తే ఆ గుట్టు వీడుతుంది. ఆ సామర్థ్యాన్ని కూడా తాజా విన్యాసాల్లో ప్రదర్శించారు.