
మిషన్ దివ్యాస్త్రతో శత్రు దుర్భేధ్య దేశంగా భారత్ అవతరించింది. రక్షణ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా అరుదైన ఘనతలు సాధిస్తోంది. అగ్ని-5 క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. విభిన్న ప్రాంతాలలోని లక్ష్యాలను ఏకకాలంలో చేధించేడమే దీని లక్ష్యం. అగ్ని-5 పరీక్ష విజయవంతం కావడంతో ఇదే తరహా సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ సరసన భారత్ నిలిచింది.
‘మిషన్ దివ్యాస్త్ర’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ‘మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్’ (ఎంఐఆర్వీ) పరిజ్ఞానాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలు తొలిసారిగా పరీక్షించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. ఇది చాలా ముఖ్యమైన మైలురాయి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడగా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి అగ్ని-5ను పరీక్షించారు. ‘మిషన్ దివ్యాస్త్ర’కు ఓ మహిళా శాస్త్రవేత్త నేతృత్వం వహించడం విశేషం. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ‘అగ్ని-5’ కు 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. చైనా నుంచి ఎదురయ్యే ముప్పులను సునాయాశంగా తొప్పికొడుతుంది.
భారత్ చేపట్టిన ‘మిషన్ దివ్యాస్త్ర’ పరీక్షను సముద్రంలో నక్కీ మరీ చైనా గమనించింది. ఈ పరీక్షకు కొన్ని వారాల ముందు నుంచే బీజింగ్ నుంచి బంగాళాఖాతం దిశగా చైనా పరిశోధక నౌక ప్రయాణించింది. మరో నిఘా ఓడ భారత్కు పశ్చిమాన మాల్దీవుల్లో తిష్ఠ వేసింది. క్వాంగ్డావ్ నుంచి ‘షియాంగ్ యంగ్ హాంగ్ 01’ నౌక ఫిబ్రవరి 23న బయల్దేరింది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ లెక్కల ప్రకారం దీని బరువు 4,425 టన్నులు.
క్షిపణి పరీక్షలకు ముందు జారీ చేసే నోటిస్ టు ఎయిర్ మిషన్ ను భారత్ మార్చి 7న జారీ చేసింది. దీంతో బంగాళాఖాతంలో 3,550 కిలోమీటర్ల రేంజిలో నౌకలు, విమానాల రాకపోకలపై నియంత్రణ విధించినట్లైంది. ఆంక్షల సమయంలో డ్రాగన్కు చెందిన ‘షియాంగ్ యంగ్ హాంగ్ 01’ బంగాళాఖాతంలో ప్రవేశించి అగ్ని-5 పరీక్షను గమనించింది. చైనా మాత్రం ఈ విషయాన్ని బుకాయిస్తోంది.
అగ్ని-5 రేంజి 5,000 కిలోమీటర్ల కంటే అధికమని చైనాకు చెందిన పలువురు నిపుణులు బలంగా నమ్ముతున్నారు. 2012లో పీఎల్ఏ అకాడమీ ఆఫ్ మిలటరీ సైన్సెస్ నిపుణుడు డువెన్లాంగ్ ఈ క్షిపణి రేంజి దాదాపు 8,000 కిలో మీటర్ల వరకు ఉంటుందని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో వివరించాడు.
2022 నవంబర్లో కూడా చైనాకు చెందిన యువాన్ వాంగ్ శ్రేణి నౌక హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకువచ్చింది. ఆ సమయంలో అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని-5 పరీక్ష చేపట్టాలని భారత్ నిర్ణయించింది. చైనా నిఘాను గమనించి నోటామ్ను రద్దు చేశారు. డిసెంబర్లో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.





