News

గగనయానం చేసే భారత వ్యోమగాములు వీరే

318views

అంతరిక్ష పరిశోధనా రంగంలో భారతదేశం శరవేగంతో దూసుకుపోతోంది. ఇటీవలే చంద్రయాన్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత్, ఇప్పుడు గగనయానంపై దృష్టి సారించింది. అంతరిక్షంలోకి మొదటిసారి మానవులను పంపించే ‘గగన్‌యాన్‌’ ప్రయోగానికి సిద్ధమవుతోంది.

భారతదేశం యావత్‌ ప్రపంచంలో తన వ్యాప్తిని పెంచుకుంటోందని, అంతరిక్ష పరిశోధనల్లో కూడా అదే వైఖరి కొనసాగుతోందనీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళే నలుగురు వ్యోమగాముల పేర్లను ఆయన ఇవాళ ప్రకటించారు.

కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గగనయానానికి ఎంపికైన నలుగురు శాస్త్రవేత్తలకూ ‘వ్యోమగామి విహంగాల’ను ప్రధానమంత్రి అందించారు.

గగన్‌యాన్‌ మిషన్‌కు ఎంపికైన నలుగురూ ఎవరంటే… గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా.

గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెడతారు. వారు ప్రయాణించే స్పేస్‌ఫ్లైట్‌ను లో ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెడతారు. వ్యోమగాములు ముగ్గురూ అక్కడ మూడురోజుల పాటు ఉంటారు. అనంతరం వ్యోమనౌక వారిని తిరిగి భూమిమీదకు తీసుకువస్తుంది.

ఈ మిషన్‌కు ఎంపికైన వ్యోమగాములకు సాంకేతిక విషయాల్లో తగిన శిక్షణ అందించారు. అలాగే శారీరక దారుఢ్యం కోసం ఫిట్‌నెస్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు.