ArticlesNews

అసలేమిటీ ఉమ్మడి పౌరస్మృతి?

396views

ఉమ్మడి పౌర స్మృతి

పెళ్ళి, విడాకులు వంటి సివిల్ లావాదేవీల్లో దేశ ప్రజలందరికీ ఒకేరకమైన చట్టాలు అమల్లో ఉండాలన్నది ఈ ఉమ్మడి పౌరస్మృతి ప్రధాన లక్ష్యం. అయితే దీనివల్ల తమ మత పద్ధతులకు విఘాతం కలుగుతుందంటూ ముస్లిములు, వారి ఓట్లు పోతాయనే భయంతో మిగతా పార్టీలు యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి. ఇంతకీ అసలు ఈ ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి?

యూసీసీ ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి సారిస్తుంది. 1. వివాహం 2. విడాకులు 3. భరణం 4. వారసత్వం 5. దత్తత. ఈ ఐదు విషయాల్లో దేశ ప్రజలందరికీ ఒకేవిధమైన చట్టం అమల్లో ఉండాలి. మతపరమైన సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నప్పటికీ దేశపౌరులందరికీ ప్రభుత్వ రక్షణ ఒకేలా ఉండాలన్నది యూసీసీ లక్ష్యం.

సాధారణంగా యూసీసీ ముస్లిముల హక్కులను హరించివేస్తుందన్న ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ నిజానికి ఇది హిందూ-ముస్లిం అన్న చర్చకు సంబంధించిన విషయం కానేకాదు. మెజారిటీ, మైనారిటీ అనే భేదాలకు తావు లేకుండా, అందరికీ ఉపయోగపడే చట్టంగా ఇది ఉంటుంది. అందుకే దీన్ని కామన్ సివిల్ కోడ్ అని కూడా అంటారు. ఇది అభ్యుదయ భావాలు కలిగిన చట్టం. గత 75ఏళ్ళుగా మహిళలు, పిల్లలు హక్కుల విషయంలో అణచివేతకు గురయ్యారు. ఆ హక్కులను వారికి కల్పించడమే ఈ పౌరస్మృతి ప్రధాన లక్ష్యం. సామాజిక న్యాయం సాధించే దిశలో ఇది పెద్ద ముందడుగు.

రాజ్యాంగబద్ధత

భారత రాజ్యాంగంలోని 37వ అధికరణం ప్రకారం రాజ్యాంగపు నాలుగవ భాగంలో ఉన్న అంశాలు న్యాయస్థానం ద్వారా అమలు చేసేవి కావు. కానీ ఆ అంశాలపై భారత ప్రభుత్వం చట్టాలు చేయదలిస్తే, దానికి ఆ హక్కు ఉంది.

ఆ అధికరణం ఆధారంగా భారత ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించగలదు. నిజానికి ఉమ్మడి పౌరస్మతి అనేది భారత రాజ్యాంగపు 4వ భాగంలోని ఆదేశసూత్రాల్లో ఉంది. 44వ అధికరణం ప్రకారం ‘ప్రభుత్వం భారత భూభాగంలోని పౌరులందరికీ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడానికి ప్రయత్నించాలి’.

భారత రాజ్యాంగపు 14 అధికరణం ప్రకారం భారతీయులందరికీ – మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలాన్ని బట్టి – సమానత్వపు హక్కు ఉంది. ఏ మతానికి, ఏ కులానికి, ఏ జాతికి, ఏ లింగానికి చెందిన వారైనా, దేశంలో ఎక్కడ పుట్టినవారైనా… వారందరినీ రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిది.

రాజ్యాంగంలోని 15వ అధికరణం ప్రకారం దేశ పౌరులు ఎవరిమీదా మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలాన్ని బట్టి వివక్ష చూపకూడదు.

రాజ్యాంగ ప్రవేశిక సామాజిక న్యాయాన్ని ప్రస్తావిస్తుంది. భావప్రకటన, దైవారాధన, విశ్వాసాలు కలిగి ఉండడానికి స్వేచ్ఛనిస్తుంది. ‘‘భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమదేశంగా చేయడానికి, ఈ దేశ ప్రజలందరికీ సామాజిక న్యాయం, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, మతం, ఆరాధన విషయాల్లో హక్కు ఇవ్వడానికీ నిర్ణయించుకున్నాము’’ అని ప్రవేశిక చెబుతుంది.

రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలు రాష్ట్రాలకు, కేంద్రానికీ ఉండే హక్కులను నిర్వచిస్తుంది. ఉమ్మడి జాబితాలో ‘వివాహం, విడాకులు, శిశువులు, మైనర్లు, దత్తత, వీలునామా, వారసత్వం, ఉమ్మడి కుటుంబం, కుటుంబాలు విడిపోవడం’ వంటి అంశాలున్నాయి. అందువల్ల ఆ అంశాలపై చట్టాలు చేయవచ్చు.

కాబట్టి, భారత రాజ్యాంగంలోని ఆదేశసూత్రాలు, ప్రవేశిక, ప్రాథమిక హక్కుల ప్రకారం భారతదేశపు పౌరులు ‘ఉమ్మడి పౌరస్మృతి’ కలిగి ఉండాలి, అది లేకుండా వారిని అణచివేయకూడదు.

పెళ్ళిళ్ళకు సంబంధించి మత సంప్రదాయాలను ఈ చట్టం ప్రభావితం చేస్తుందా?

లేదు. ఏ మతానికి లేదా ఏ మత విభాగానికి చెందిన సంప్రదాయాలు, ఆచారాల మీద ఉమ్మడి పౌరస్మృతి ఎలాంటి ప్రభావమూ చూపదు. నిజానికి, ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకించడానికి ఈ అంశాన్నే భూతద్దంలో చూపించారు. అసలు నిజం ఏంటంటే ఈ కోడ్ దేశంలోని అన్ని మతాల మీదా, వాటి సంస్కృతి, సంప్రదాయాల మీదా ప్రభావం కలిగి ఉండదు. అంటే ముస్లిముల నిఖా, సిఖ్ఖుల ఆనంద్ కరాజ్, హిందువుల సప్తపది, క్రైస్తవుల హోలీ మ్యాట్రిమొనీ వంటి పద్ధతులపై కామన్ సివిల్ కోడ్ ప్రభావం ఏమీ ఉండదు. ఏ మతానికి చెందిన వారు తమ మతాలలోని విశ్వాసాలు, ఆచారాల ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు.

వివిధ తెగల ఆచారాలు, సంప్రదాయాలను ఈ చట్టం ప్రభావితం చేస్తుందా?

లేదు. దేశంలోని ఏ తెగకు చెందిన ఆచారాలు, సంప్రదాయాలపై కామన్ సివిల్ కోడ్ ఎలాంటి ప్రభావమూ చూపదు. నిజానికి అలాంటి ఆచారాలు, సంప్రదాయాలకూ ఈ చట్టానికీ ఎలాంటి సంబంధమూ లేదు. వాటి రక్షణకు భారత ప్రభుత్వంలోనూ, రాజ్యాంగ సభలోనూ తగిన ఏర్పాట్లు చేసారు.

వివిధ తెగల ధార్మిక, సాంస్కృతిక రక్షణకు ఎలాంటి చట్టాలున్నాయి?

రాజ్యాంగ అధికరణం 371(ఎ) నాగా తెగ వారి సంస్కృతి, సంప్రదాయాలను రక్షిస్తుంది. దాని ప్రకారం నాగాల మత, సామాజిక అభ్యాసాలపై పార్లమెంటు చట్టాలేవీ వర్తించవు. అవి వర్తించాలంటే నాగాలాండ్ రాష్ట్రశాసనసభలో తీర్మానం చేసి, దాన్ని ఆమోదించాలి.

రాజ్యాంగ అధికరణం 371(జి) మిజో తెగ వారి సంస్కృతి, సంప్రదాయాలను రక్షిస్తుంది. దాని ప్రకారం మిజోల మత, సామాజిక అభ్యాసాలపై పార్లమెంటు చట్టాలేవీ వర్తించవు. అవి వర్తించాలంటే నాగాలాండ్ రాష్ట్రశాసనసభలో తీర్మానం చేసి, దాన్ని ఆమోదించాలి.

రాజ్యాంగ అధికరణం 338(ఎ), షెడ్యూల్డు తెగల జాతీయ కమిషన్ ఏర్పాటుకు వీలు కల్పించింది. షెడ్యూల్డు తెగల రక్షణ, సంక్షేమం, అభివృద్ధిలో ఆ కమిషన్ కీలక పాత్ర పోషిస్తోంది.

భారత పార్లమెంటు షెడ్యూల్డు తెగలు, ఇతర సంప్రదాయిక అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం 2006ను ఆమోదించింది. ఆ చట్టం కూడా అడవుల మీద ఆధారపడి జీవించే తెగల సంప్రదాయిక విజ్ఞానం, ఆచార వ్యవహారాల విషయంలో వారి హక్కులకు చట్టపరమైన రక్షణ కల్పించింది.

భారత రాజ్యాంగపు 5,6 షెడ్యూళ్ళలో షెడ్యూల్డు తెగల ప్రాంతాలను ప్రకటించారు. 5వ షెడ్యూలులో ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్ అనే పది రాష్ట్రాలున్నాయి. 6వ షెడ్యూలులో మేఘాలయ, అస్సాం, మిజోరం, త్రిపుర అనే నాలుగు రాష్ట్రాలున్నాయి.

ఐదవ షెడ్యూలులోని అధికరణం 244(1), నియమం 4 ప్రకారం, ఆ షెడ్యూల్లో పేర్కొన్న రాష్ట్రాల్లో రాష్ట్రపతి సూచనల మేరకు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ – గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయవచ్చు. ఆయా రాష్ట్రాల్లోని షెడ్యూల్డు తెగల అభివృద్ధి, సంక్షేమం కోసం సలహాలివ్వడం ఆ మండలి కర్తవ్యం.

ఆరవ షెడ్యూలులో, నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లోనూ స్వయంపాలిత జిల్లా మండళ్ళు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ ప్రాంతాలలోని తెగల హక్కులను రక్షించడానికి, స్వయంప్రతిపత్తి కలిగిన స్థానిక పరిపాలనకు హక్కులు కల్పించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చారు. అందులో నాలుగు చట్టాలున్నాయి. (1) హిందూ వివాహ చట్టం 1955 (2) హిందూ దత్తత మరియు భరణం చట్టం 1956 (3) హిందూ మైనారిటీ అండ్ గార్డియన్‌షిప్ యాక్ట్ 1956 (4) హిందూ వంశపారంపర్య చట్టం 1956. ఈ చట్టాలు ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నాయి. అయితే ఈ చట్టాల పరిధిలోనుంచి షెడ్యూల్డు తెగలను మినహాయించారు. వారికి వారి ఆచార వ్యవహారాలను అనుసరించే హక్కు యథాతథంగా ఉంది.

కాబట్టి, ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ, షెడ్యూల్డు తెగల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల రక్షణకు భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాల మీద ఆ స్మృతి ఎలాంటి ప్రభావమూ చూపించదు.

ఉమ్మడి పౌరస్మృతి కొన్ని మతాల, కొన్ని తెగల ప్రజలకు వ్యతిరేకం అంటూ వివిధ పక్షాలు తమ రాజకీయ కారణాల కోసం చేసే ప్రచారం అంతా ఉత్తదే. ఉమ్మడి పౌరస్మృతి దేశ ప్రజలందరికీ కొన్ని నిర్దిష్ట అంశాల్లో మేలు చేయడానికి ఉద్దేశించినది అని దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.