
భారత మాజీ నేవి అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ నెల 17న తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని వారాల్లో ఈ కేసులో తీర్పు రానుందని, దీనికి సంబంధించిన అన్ని అంశాలను న్యాయస్థానానికి సమర్పించామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. కాగా గూఢచార్యం ఆరోపణలతో 2016లో కులభూషణ్ జాదవ్ను ఇరాన్లో పాక్ ఏజెంట్లు అపహరించారు. ఆ తరువాత బలూచిస్తాన్లో ఆయన ప్రవేశిస్తే అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాక్ మిలిటరీ కోర్టు ఆయనకు 2017 ఏప్రిల్లో మరణశిక్షను విధించింది. కులభూషణ్ జాదవ్ విషయంలో పాక్ తీరుపై భారత్ ఘాటుగా స్పందించింది. ఇరాన్లో ఉంటున్న జాదవ్ను పాక్ కిడ్నాప్ చేసిందని భారత్ పేర్కొంది. పాక్ విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో 2017 మే 18న ఆయన మరణశిక్షపై స్టే విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో త్వరలో తీర్పు వచ్చే అవకాశం ఉంది.






