News

అయోధ్య రామయ్య హారతి పాస్‌‌ల బుకింగ్ ఇలా..

366views

జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. ఆలయం ప్రారంభమైన తర్వాతి రోజు నుంచి అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లాకు రోజుకు మూడు సార్లు హారతి ఇస్తారు. ఉదయం 6.30 గంటలకు శృంగార హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రత్యేక పాస్‌లు కలిగిన వారిని మాత్రమే ఈ హారతులకు అనుమతిస్తారు. ప్రస్తుతానికైతే ప్రతి హారతికి 30 మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. హారతి పాస్‌ను ఉచితంగానే జారీ చేస్తారు. ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డులను సమర్పించి హారతిని వీక్షించవచ్చు.ఈనేపథ్యంలో రామ్ లల్లా హారతి పాస్‌లను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం..

హారతి పాస్‌లకు అప్లై చేసే పద్ధతి

• శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారిక వెబ్‌సైట్ srjbtkshetra.org నుంచి రామ్‌లల్లా హారతి పాస్‌లను బుక్ చేసుకోవచ్చు.

• ఈ వెబ్‌సైట్ హోంపేజీలో ఎడమ వైపు ఎగువ భాగంలో ‘ఆర్తి’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.

• మీరు హాజరు కావాలనుకుంటున్న తేదీ, హారతి రకాన్ని ఎంచుకోండి.

• మీ పేరు, చిరునామా, ఫోటో, మొబైల్ నంబర్‌ సహా అవసరమైన సమాచారాన్ని అందులో నింపండి.

• పై దశలను పూర్తి చేసిన తర్వాత.. అయోధ్య రామాలయంలోని కౌంటర్ నుంచి మీ పాస్‌లను తీసుకొని నేరుగా హారతి వేడుకకు వెళ్లొచ్చు.

• హారతి పాస్‌ను మంజూరు చేయడానికి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను అంగీకరిస్తారు.

హారతి పాస్‌ల కోసం మార్గదర్శకాలు

• పదేళ్లలోపు పిల్లలకు ప్రత్యేక హారతి పాస్ అవసరం లేదు.

• హారతి బుకింగ్ టైంలో సమర్పించిన ID ప్రూఫ్ ఫిజికల్ కాపీని హారతి తేదీన ఆలయంలో తప్పకుండా సమర్పించాలి.

• ముందస్తుగా హారతి పాస్‌ను బుక్ చేసుకున్న వారికి.. షెడ్యూల్డ్ టైం కంటే 24 గంటల ముందు ఆలయం వెబ్ సైట్ నుంచి మెసేజ్, ఈమెయిల్ రిమైండర్‌ వస్తాయి.

• రిమైండర్ లింక్ ఆలయంలోకి వచ్చే సమయానికి ఒక గంట ముందు వరకు యాక్టివ్‌గా ఉంటుంది. ఆలోగా దానిపై క్లిక్ చేసి హారతి వేడుకకు వస్తున్నామని సమాధానం ఇవ్వాలి.

• భక్తులు ఆలయానికి వచ్చిన తర్వాత హారతి పాస్‌ను కౌంటర్‌లో పొందొచ్చు.