
జగద్గురు ఆదిశంకరాచార్యుల సంప్రదాయాన్ని అనుసరిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని ఆస్ట్రేలియాకు చెందిన జార్డి మూర్ భారతదేశంలో ప్రచారం నిర్వహిస్తోంది. మూడు వారాల క్రితం పూరీలో ప్రారంభించిన పాదయాత్ర కేరళలోని కాలడి (ఆదిశంకరాచార్యులు పుట్టిన గ్రామం) మీదుగా చార్ధామ్ వరకు కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా గురువారం ఆమె విశాఖలోని శారదా పీఠానికి చేరుకున్నారు. దేశంలో సుమారు 6 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆదిశంకరుల సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నట్లు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములకు ఆమె తెలిపారు. రోజుకు 50 కిలోమీటర్లు నడక సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని పెర్త్కు చెందిన జార్డిమూర్ యోగా గురువు. యూకే, టాస్మానియా దేశాల్లో పర్యటించిన ఆమె ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితురాలై పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమెను పీఠాధిపతులు ఆశీర్వదించారు.





