
దక్షిణ ముంబయిలోని ఇరుకైన సందులతో కూడిన గిర్గావ్ ప్రాంత వినాయక చవితి వేడుకల మండపాలకు 131 ఏళ్ల చరిత్ర ఉంది. ‘సార్వజనిక్ గణేశ్ ఉత్సవ్ సంస్థ’ ఏటా ఇక్కడ ఏర్పాటు చేసే వినాయక మండపాలది నగరంలోనే అత్యంత పురాతన ప్రాశస్త్యం.
ఓ శతాబ్దం కిందట 1893లో రావ్ బహదూర్ లిమాయె, గాడ్సే శాస్త్రి ఈ సంస్థను ప్రారంభించి స్థానిక ఖాదిల్కర్ రోడ్డులోని కేశవ్జీ నాయక్ చావిడిలో ‘గణేష్’ ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ”లోకమాన్య బాలగంగాధర్ తిలక్కు సన్నిహితులైన వారిద్దరూ ఆయన పిలుపు మేరకే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా భారతీయులను సంఘటితం చేసేందుకు ఇక్కడ గణేశ్ చతుర్థి వేడుకలను జరిపేవారు” అని సంస్థ కార్యదర్శి అయిన కుమార్ వాలేకర్ తెలిపారు. ఆడంబరాలకు వెళ్లకుండా రెండడుగుల మట్టి గణపతితో సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుతూ రావడం వీరి ప్రత్యేకత. ఏటా వేదిక, స్తంభాలను మాత్రమే బయట నుంచి తెప్పిస్తామని.. మిగతా అలంకరణ అంతా స్థానికులే ఓ కుటుంబంలా ఏర్పడి చేస్తారని వాలేకర్ చెప్పారు. గతంలో బాలాసాహెబ్ ఠాక్రే, మురళీ మనోహర్ జోషి, అమిత్ షా వంటి రాజకీయ ప్రముఖులు ఈ గణపతి మండపాన్ని సందర్శించి ఆశీర్వాదాలు పొందారు. వేడుకల అనంతరం హోరు శబ్దాలు లేకుండా ఓ పల్లకిలో విగ్రహాన్ని తరలించి గిర్గావ్ నీటి పాయలో నిమజ్జనం చేస్తారు.




