
సీ-295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానం.. భారత వైమానిక దళంలో చేరింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఉత్తర్ప్రదేశ్లోని హిండన్ ఎయిర్బేస్లో ఈ విమానాన్ని వాయుసేనలో ప్రవేశపెట్టారు. ప్రత్యేక మిషన్లు చేపట్టడం సహా విపత్తు సమయాల్లోనూ, సముద్ర గస్తీలోనూ ఈ రవాణా విమానం ఎంతగానో ఉపయోగపడనుంది. 5 నుంచి 10 టన్నుల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన సీ-295 ఎయిర్క్రాఫ్ట్ 71 మంది సైనికులు లేదా 50 మంది పారాట్రూపర్లను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించగలదు. భారీ విమానాలు చేరుకోలేని ప్రదేశాలకు సైతం లాజిస్టిక్ కార్యకలాపాలు సాగించగలదు.
భారత్ డ్రోన్ శక్తి 2023 ప్రదర్శన: స్పెయిన్కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ తయారు చేసిన సీ295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానాన్ని భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. భారత వైమానిక దళ సామర్థ్యాన్ని ఆధునికీకరించే లక్ష్యంతో రెండేళ్ల క్రితం 21 వేల 935 కోట్లతో 56 సీ-295 రవాణా విమానాల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. అందులో భాగంగా తయారైన తొలి విమానం ఇప్పుడు భారత వైమానిక దళంలో చేరింది. ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్బేస్లో అధికారికంగా భారత వాయుసేనలోకి దీన్ని ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హ్యాంగర్ వద్ద సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు.
5 నుంచి 10 టన్నుల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన సీ-295 ఎయిర్క్రాఫ్ట్ 71 మంది సైనికులు లేదా 50 మంది పారాట్రూపర్లను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించగలదు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న భారీ విమానాలు చేరుకోలేని ప్రదేశాలకు సైతం లాజిస్టిక్ కార్యకలాపాలు సాగించగలదు. ఈ విమానం ప్రత్యేక మిషన్లతోపాటు విపత్తు ప్రతిస్పందన, సముద్ర గస్తీ విధులను నిర్వహించగలదు. భారత వైమానిక దళానికి చెందిన ఆరుగురు పైలట్లు, 20 మంది సాంకేతిక నిపుణులు ఇప్పటికే సివిల్లెలో ఈ విమానం నడిపేందుకు శిక్షణ పూర్తి చేసుకున్నారు.
కాగా.. భారత వాయుసేన, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన.. భారత్ డ్రోన్ శక్తి-2023 ప్రదర్శనను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొన్ని డ్రోన్ల విన్యాసాలను రాజ్నాథ్ సింగ్, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ కలిసి వీక్షించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా పరిశీలించారు. 50 నుంచి 100 కిలోల బరువైన పేలోడ్లను మోసుకుని వెళ్లే డ్రోన్లను రక్షణమంత్రి, వాయుసేన అధిపతి పరిశీలించారు. శత్రువులపై దాడులు చేయగల కమికజే సైనిక డ్రోన్లను పనితీరును సైతం వీక్షించారు. అలాగే మోటార్ బైక్లపై నుంచి కిసాన్ డ్రోన్లను ఆపరేట్ చేయడాన్ని రాజ్నాథ్ సింగ్ పరిశీలించారు.





