అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో భారతీయుడు… అందరినీ ఆకర్షిస్తున్న వివేక్ రామస్వామి.. అసలు ఈయనెవరో తెలుసా?

చైనా ముప్పును తప్పించడం, ప్రతిభకు పెద్ద పీట వేయడం తన లక్ష్యాలని చెబుతూ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామి చాలా చురుకైన యువకుడు. బయోటెక్ ఎంటర్ప్రెన్యూవర్గా విజయం సాధించి మంచి పేరు సంపాదించిన ఆయన రిపబ్లికన్ పార్టీ తరపున ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్నత స్థాయికి చేరి అమెరికాను నడుపుతున్న ఇండియన్ అమెరికన్ల జాబితాలో చేరేందుకు దూసుకెళ్తున్నారు.
కేరళలో మూలాలు …
వివేక్ రామస్వామి తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. ఆయన తండ్రి జనరల్ ఎలక్ట్రిక్ ఇంజినీరు కాగా, తల్లి గెరియాట్రిక్ సైకియాట్రిస్ట్. ఆయన ఓహియోలోని సిన్సినాటిలో జన్మించారు. ఆయన అపూర్వ తివారీని వివాహం చేసుకున్నారు. ఆమె ఓహియో స్టేట్ యూనివర్సిటీ వెక్స్నర్ మెడికల్ సెంటర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 37 సంవత్సరాలు. రిపబ్లికన్ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
నిక్కీ హాలీ తర్వాత…
రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలోకి ప్రవేశించిన ఇండియన్ అమెరికన్లలో నిక్కీ హాలీ తర్వాత వివేక్ రెండో నేత. ఫాక్స్ న్యూస్ ప్రైమ్ టైమ్ షోలో వివేక్ మాట్లాడుతూ… తాను రానున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తానని ప్రకటించారు. అమెరికా ఆదర్శాలను పునరుజ్జీవింపజేయడం కోసం తాను పోటీ పడుతున్నానని చెప్పడానికి గర్వపడుతున్నట్లు తెలిపారు. మన జీవితాల్లో ప్రతి అంశంలోనూ ప్రతిభను తిరిగి తీసుకురావాలన్నారు. అమెరికన్ జీవనంలో ప్రతి దశలోనూ అన్యాయమైన చర్యలకు తెరదించుతానని చెప్పారు.
ఆ వాస్తవాన్ని మర్చిపోతున్నాం…
నేషనల్ ఐడెంటిటీ క్రైసిస్ను తోసిరాజని రానున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు వివేక్ ప్రకటించారు. వామపక్ష భావజాలం వల్ల ఈ క్రైసిస్ వచ్చిందని ఆయన చెప్తూ ఉంటారు. విశ్వాసాలు, దేశభక్తి, కఠోర శ్రమ స్థానంలో కోవిడిజం, క్రైమేటిజం, జెండర్ ఐడియాలజీ వంటి నూతన లౌకికవాద మతాలు వచ్చాయని పేర్కొన్నారు. మనమంతా అమెరికన్లమనే వాస్తవాన్ని మర్చిపోయేంతగా వైవిద్ధ్యాలు, వ్యత్యాసాలతో నిండిపోయామన్నారు.
అమెరికాలోని అయోవా రాష్ట్రంలో వివేక్ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్స్ నిర్వహించారు. ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసం కాకుండా, తాను చాలా శ్రద్ధ, పట్టుదలతో పని చేస్తున్నానని చెప్పారు. తాను విజయం సాధిస్తే ఫెడరల్ వర్కర్స్కు ఇస్తున్న సివిల్ సర్వీస్ ప్రొటెక్షన్స్ను రద్దు చేస్తానని, చట్టవిరుద్ధమైన జాతి ఆధారిత ప్రాధాన్యాలపై విచారణ జరపాలని జస్టిస్ డిపార్ట్మెంట్ను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు.
చైనా ఎదుగుదల వంటి ముప్పులను అమెరికా ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. అమెరికా సార్వభౌమాధికారాన్ని చైనా ఉల్లంఘిస్తోందని, రష్యన్ గూఢచార బెలూన్ వచ్చి ఉంటే, వెంటనే కూల్చేసి, ఆంక్షలను విధించి ఉండేవారమని, చైనా విషయంలో అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పడం చాలా సులువని చెప్తూ, మన ఆధునిక జీవనం కోసం చైనాపై అమెరికన్లు ఆధారపడుతున్నారని తెలిపారు. ఆర్థికంగా పరస్పరం ఆధారపడే సంబంధాలకు తెరదించాలన్నారు. అర్థరహితమైన యుద్ధాలపై దృష్టి పెట్టడం కన్నా, ఇటువంటివాటిపై స్పందించడం విదేశాంగ విధానంలో ప్రధానంగా ఉండాలన్నారు. దీని కోసం కొన్ని త్యాగాలు అవసరమని తెలిపారు. చైనాపై ఆధారపడకూడదన్నారు. చైనా నుంచి స్వతంత్రం రావాలన్నారు. అయితే అది అంత సులభం కాదని చెప్పారు. కొంత అసౌకర్యం తప్పదని స్పష్టం చేశారు. హార్వర్డ్, యేల్ సభల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఆయన కీలక రాష్ట్రాల ఎన్నికల కోసం అవసరమైన నిధులను కూడా సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది.





