
ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పొదిలి పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి దేవాలయంలో రథోత్సవం ఉత్సాహంగా జరిగింది. దక్షిణ కాశీగా పేరున్న ఈ క్షేత్రంలో 14 రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలుత మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, తహసీల్దార్ భాగ్యలక్ష్మీ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్, రథం నిర్మాణదాత తొలి ఉభయదాత, సామంతపూడి నాగేశ్వరరావులను ఆలయ మర్యాదలతో దేవస్థానం చైర్మన్ యక్కలి శేషగిరి, ఈవో శ్రీనివాసరావులు స్వాగతం పలికారు. రథంపై స్వామివారి ఉత్సవ మూర్తిని ఏర్పాటు చేసి పట్టణంలోని మాడవీధుల్లో రథోత్సవం నిర్వహించారు. గౌరీ శంకరులుగా స్వామి వారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశేషంగా వచ్చిన భక్తులు హరహర మహాదేవ అంటూ స్వామి వారికి నీరాజనాలు పలుకుతూ రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. పట్టణంలోని చిన్న బస్టాండ్, పెద్ద బస్టాండ్, నిమ్మయ్య హోటల్, రాఘవేంద్ర సినిమా హాల్ మీదుగా రధోత్సవం సాగింది. ఆనవాయితీ ప్రకారం నిమ్మయ్య హోటల్ దాటిన తరువాత రథాన్ని లాగేందుకు మహిళలకు అవకాశం కల్పించారు. భక్తులు మండుటెండను సైతం లెక్క చేయకుండా బిందెలతో వారు పోస్తూ కాయకర్పూరంతోపాటు, గుమ్మడికాయలు రఽధచక్రాల కింద ఉంచి వారి మొక్కులు తీర్చుకున్నారు.





