News

ఆఫ్తాబ్‌ బహుమతులిచ్చాడు..!

147views

న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో వెలుగు చూసిన వాస్తవాలు చూసి అఫ్తాబ్‌ కొత్త స్నేహితురాలు షాక్‌లోకి వెళ్ళిపోయింది. శ్రద్ధాను హత్య చేసి.. ఆమె శరీర భాగాలను ఫ్రిజ్‌లో ఉంచిన ఆఫ్తాబ్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా మరో యువతిని పరిచయం చేసుకొని ఇంటికి రప్పించాడు. ఆమె ఒక మానసిక వైద్యురాలు. ఇటీవల ఆమెను పోలీసులు విచారించారు. ఆఫ్తాబ్‌ ఫ్లాట్‌కు వెళ్ళిన సమయంలో అతడి ఫ్రిజ్‌లో మానవ శరీర భాగాలు ఉన్న విషయం తనకు తెలియదని ఆమె పోలీసులకు వెల్లడించింది. హత్య జరిగిన తర్వాత రెండు సార్లు తాను ఆ ఫ్లాట్‌కు వెళ్ళినట్టు అంగీకరించింది.

శ్రద్ధా హత్య జరిగిన 12 రోజుల తర్వాత మే 30న అఫ్తాబ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడు సాధారణంగానే కనిపించేవాడని పోలీసులకు తెలిపింది. కాకపోతే సిగరెట్లు అతిగా తాగేవాడని.. వాటిని అతడే స్వయంగా తయారు చేసుకొనేవాడని వివరించింది. అతడి వద్ద డియోడరెంట్‌, పెర్‌ఫ్యూమ్‌ల కలెక్షన్‌ ఉందని.. వాటిల్లో కొన్ని తనకు బహుమతిగా ఇచ్చాడని తెలిపింది. అక్టోబర్‌ 12వ తేదీన ఆఫ్తాబ్‌ తనకు ఫ్యాన్సీ ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడని ఆ యువతి పోలీసులకు చెప్పింది. ఆ నెలలో రెండుసార్లు అతడిని కలిసినట్టు తెలిపింది. ఆఫ్తాబ్‌ తరచూ ముంబయిలోని తన ఇంటి గురించి ఆమెతో చెప్పేవాడని పేర్కొంది.

అతడు వివిధ రకాల మాంసాహార వంటకాలను ఆర్డర్‌ చేసి ఇంటికి తెప్పించుకొనేవాడని పేర్కొంది. కొన్ని సార్లు చెఫ్‌లు వంటకాలను ఎలా అలంకరిస్తారో కూడా వివరించేవాడని పేర్కొంది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకొన్నారు. ప్రస్తుతం ఆ యువతి తీవ్రమైన షాక్‌లో ఉండటంతో మానసిక చికిత్స పొందుతోంది. అఫ్తాబ్‌ డేటింగ్‌ సైట్ల సాయంతో దాదాపు 20 మంది మహిళలను సంప్రదించినట్టు పోలీసులు గుర్తించారు.

Source:  Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి