
* పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా చైనా నిర్మాణాలు… హెచ్చరించిన భారత్
భారత్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా చైనా తన వక్రబుద్ధిని మానుకోవటం లేదు. సరిహద్దుల్లో ఏదో రకంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్ ఆర్మీ కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), బలోచిస్థాన్, సింధ్ ప్రాంతాల్లోకి ప్రవేశించింది. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఆసీ) నిర్మాణంలో మాత్రమే కాకుండా చైనా ఇంజనీర్లు పీఓకేలోనూ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు చెందిన 10-12 మంది వ్యక్తులు పీఓకేలోని శార్దా ప్రాంతంలో కనిపించారు. వారు పాకిస్థాన్ ఆర్మీ కోసం భూగర్భ బంకర్లు నిర్మించటంలో నిమగ్నమయ్యారు. పాక్ సైన్యం ఆ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తోంది.
నియంత్రణ రేఖకు సమీపంలోని నీలం లోయలో 10-15 మంది చైనా ఇంజనీర్లు బంకర్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఫుల్లవాయ్ గా పిలుస్తారు. కశ్మీర్లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. మరోవైపు.. సింధ్, బలోచిస్థాన్ ప్రాంతాల్లోనూ చైనా సైనికులు నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే రాణికోట్, నవాబ్షా, ఖుజ్దార్ ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి.
అయితే.. పాకిస్థాన్ ఆర్మీకి కావాల్సిన మౌలిక సదుపాయాల నిర్మాణంలో చైనా సైన్యం ఎందుకు పాల్గొంటుందన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. సీపెక్ ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవటం వల్లే పాకిస్థాన్ సైన్యానికి చైనా ఆర్మీ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీపెక్ ద్వారా సింకియాంగ్ ను గ్వాదర్ పోర్ట్ తో అనుసంధానించాలని భావించారు. అయితే అది అక్కడికి చాలా దూరంలో ఉంది.