
తక్కువ రేటు చైనా ఫోన్ల అమ్మకాలను భారత్ లో నిషేధించాలన్న భారత ప్రభుత్వ తాజా నిర్ణయం ద్వారా షావోమీ లాంటి చైనీస్ బ్రాండ్లతో సహా చాలావాటికి దెబ్బ పడనుంది. ముఖ్యంగా ప్రపంచంలోని రెండవ అతిపెద్ద మొబైల్ మార్కెట్ అయిన భారత్.. తద్వారా దిగువ విభాగం నుండి చైనీస్ కంపెనీలను బయటకు గెంటేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశ ప్రవేశ-స్థాయి(ఎంట్రీ లెవల్) మార్కెట్ నుంచి తప్పించడం ద్వారా షావోమీ, మరికొన్ని సహచర కంపెనీలను నిలువరించడమే భారత వ్యూహమని నిపుణులు చెప్తున్నారు. చైనాలో కరోనా, లాక్డౌన్ ప్రభావంతో అక్కడి మార్కెట్ ఘోరంగా దెబ్బతింటోంది. దీంతో ఎక్కువగా భారతదేశంపైనే ఆధారపడుతోంది ఆ మార్కెట్. మార్కెట్ ట్రాకర్ కౌంటర్ పాయింట్ ప్రకారం, జూన్ 2022 వరకు త్రైమాసికంలో $150(12వేలరూపాయల) లోపు స్మార్ట్ ఫోన్లు.. భారతదేశ విక్రయాలకుగానూ మూడింట ఒక వంతుకు దోహదపడ్డాయి. చైనా కంపెనీలు ఆ షిప్మెంట్లలో 80% వరకు ఉండడం గమనార్హం.
ఇప్పటికే షావోమీ, ఒప్పో , వివో వంటి చైనీస్ సంస్థలు భారత్లో ఆర్థిక సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ట్యాక్సుల ఎగవేతతో పాటు ఏకంగా మనీల్యాండరింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి కూడా. అయితే చైనీస్ ఫోన్లు, ఉత్పత్తులను నేరుగా నిషేధించేందుకు ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్ ఉన్నందున.. గతంలో హువాయ్, జెడ్ టీఈ లాంటి దిగ్గజాల టెలికాం పరికరాలను నిషేధించడానికి అనధికారిక మార్గాలను భారత్ ఉపయోగించింది. చైనా ఫోన్ల విషయంలో కూడా అలాంటి స్ట్రాటజీనే పాటించాలని భావిస్తోంది.
మరోవైపు.. భారత్ లో యూనిట్ల ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీలపై ఒత్తిడి చేస్తోంది. స్థానికంగా సప్లయ్ చెయిన్లు ఏర్పాటు చేయాలని, భారీగా ఇన్వెస్ట్ మెంట్లు పెట్టాలని, భారత్ నుంచే ఎగుమతి చేయాలని కోరుతూ వస్తోంది. తద్వారా చైనా ఫోన్లకు మేడ్ ఇన్ ఇండియా మార్క్ తో పాటు స్థానికంగా ఉపాధి కల్పన కూడా ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది.





