
భోపాల్: బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మకు మద్దతు తెలుపుతున్న వాళ్ళపై దాడులు పెరిగిపోతున్నాయి. ఉదయ్పూర్, అమరావతి దారుణ హత్యోదంతాల తర్వాత.. బీహార్లో ఓ యువకుడు వాట్సాప్ స్టేటస్గా నూపుర్ శర్మ వ్యాఖ్యల వీడియోను పెట్టుకున్నాడని దుండుగులు కత్తులతో గాయపరిచారు. తాజాగా మధ్యప్రదేశ్లోనూ ఓ బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి చేసింది ఓ మూక.
బుధవారం అగర్-మాల్వాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నూపుర్ శర్మ కామెంట్లకు మద్దతు ప్రకటించిన ఓ వ్యక్తిని కత్తులతో పొడిచారు పదమూడు మంది. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని.. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ దాడితో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బజరంగ్ దళ్ స్థానిక కన్వీనర్ అయిన ఆయూష్ జడమ్(25) స్థానిక మీడియాలో బహిరంగంగా నూపుర్ శర్మకు మద్దతు ఇస్తూ వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ఉదయం స్థానిక టోల్ బూత్ నుంచి బైక్పై వెళ్తున్న సమయంలో అతనిపై దాడి చేసింది ఓ గ్రూప్. దీంతో బాధితుడిని చికిత్స కోసం ఉజ్జయిని ఆస్పత్రిని తరలించారు. దాడికి పాల్పడిందంతా స్థానికులేనని పోలీసులు నిర్ధారించారు. కాగా, ఈ ఘటనను నిరసిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట హిందూ సంఘాలు బైఠాయించి ఆందోళన చేపట్టాయి.