
విజయవాడ: విజయవాడ శివారు అజిత్సింగ్ నగర్ లూనాసెంటర్ నివాసముంటున్న కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ ఇంటిని ఎన్ఐఏ అధికారులు చుట్టుముట్టారు. స్థానిక పోలీసుల సాయంతో సోదాలు చేశారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున బలగాలు మోహరించడమే కాకుండా పౌరుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. చత్తీస్గఢ్, ఒడిశా రాష్టాల ఎన్ఐఏ అధికారుల బృందం…మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కోణంలో సోదాలు చేసినట్టు సమాచారం. ప్రభాకర్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.
ఇటీవల మరణించిన డప్పు కళాకారుడు, జననాట్య మండలి నాయకుడు డప్పు రమేష్ ఇంట్లోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. న్యూ రాజరాజేశ్వరీపేట అమరావతి కాలనీలోని రమేష్ భార్య జ్యోతి ఇంట్లో రాత్రి 7.15 గంటల వరకు తనిఖీలు చేశారు.
మూడు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో డిజిటల్ పరికరాలు, పలు పోస్టర్లు, బ్యానర్లు, మావోయిస్టు సాహిత్యం, కరపత్రాలు, డైరీలు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. రెండేళ్ళ కిందట జరిగిన చత్తీస్ఘడ్ ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నట్టు పేర్కొంది.





