News

చైనా మొబైల్ తయారీ సంస్థ ఒప్పో మోసం

470views

న్యూఢిల్లీ: చైనాకు చెందిన వివో సంస్థ చేసిన రూ.62 వేల కోట్ల మోసం సంగతి తేలకుండానే మరో చైనా సంస్థ మోసం వెలుగుచూసింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ దేశంలో రూ.4,389 కోట్ల మోసానికి పాల్పడ్డట్లు తేలింది.

ఈ మేరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన కస్టమ్స్ డ్యూటీని ఎగవేసినట్టు ‘ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)’ గుర్తించింది. ఒప్పో సంస్థ దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్, హోల్‌సేల్ ట్రేడింగ్, యాక్సెసరీస్ తయారీ, అమ్మకంతోపాటు వన్‌ప్లస్, రియల్‌మి వంటి బ్రాండ్ల పంపిణీ కూడా చేపడుతుంది. దీంతో సంస్థకు భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది. సంస్థ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించిన సమాచారం రావడంతో డీఆర్ఐ విచారణ జరిపింది.

సంస్థ కార్యాలయాలతోపాటు, ప్రధాన సిబ్బంది ఇళ్ళ‌లో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు సంబంధించి కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టినట్టు డీఆర్ఐ గుర్తించింది. దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించింది. రాయల్టీ, లైసెన్స్ ఫీజులను కూడా సంస్థ విదేశాలకు పంపినట్టు తేలింది. కస్టమ్స్ డ్యూటీ విషయంలో తేడాలు రావడంతో ఒప్పో సంస్థ రూ.450 కోట్ల కస్టమ్స్ డ్యూటీని స్వచ్ఛందంగా డిపాజిట్ చేసింది. ఈ వ్యవహారంపై సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే రూ.4,389 కోట్లు చెల్లించాలని డీఆర్ఐ ఆదేశించింది. దీనిపై జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి