అగ్ని ప్రమాదాల నివారణకు కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: రైళ్ళలో అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వంట వండే ప్యాంట్రీ కార్లలో గ్యాస్ సిలిండర్ల వినియోగంపై నిషేధం విధించింది. వీటికి బదులు ఎలక్ట్రిక్ ఇండక్షన్లను వినియోగించాలని అన్ని జోనల్ రైల్వేలకు ఐఆర్సీటీసీ (ఐ.ఆర్.సి.టి.సి) లేఖ రాసింది. ఎల్.పి.జి గ్యాస్ అత్యంత ప్రమాదకరమైనది. సిలిండర్ పేలడం లేదా గ్యాస్ లీకేజీ కావడం వల్ల భారీ అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందుకే హై లెవల్ సేఫ్టీ రివ్యూ కమిటీ సిఫార్సుల దృష్ట్యా ప్యాంట్రీ కార్లలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న ఎల్.పి.జి ఆధారిత ప్యాంట్రీ కార్లను ఫ్లేమ్లెస్ ప్యాంట్రీ కార్లుగా మార్చడానికి సుమారు రూ. 60 లక్షలు ఖర్చవుతుంది. అయినా ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.