
మహాత్ముడు, సర్దార్ పటేల్ కలలు కన్న భారత్ ను నిర్మించేందుకు ఈ ఎనిమిదేళ్ల పాటు నిజాయతీగా కృషిచేశామని ప్రధాని మోడీ అన్నారు.
తాము దేశ సేవలో ఎన్నడూ రాజీ పడలేదని తెలిపారు. గుజరాత్ నేర్పిన పాఠాలే తనను ఇలా తీర్చిదిద్దాయని కృతజ్ఞత చాటారు. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న స్వరాష్ట్రం గుజరాత్లోని రాజ్ కోట్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ పటేల్ సేవా సమాజ్ ట్రస్ట్ నిర్మించిన కేడీపీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. అది 200 పడకలున్న ఆసుపత్రి.
‘జన్ ధన్ యోజన ద్వారా పేద ప్రజలు ప్రయోజనం పొందారు. కోవిడ్ క్లిష్ట సమయంలో ప్రజలకు ఉచితంగా టీకాలు అందేలా చూసుకున్నాం. రైతులు, కార్మికుల జన్ ధన్ ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం. పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఏర్పాటు చేశాం. దేశసేవ విషయంలో ఎన్నడూ రాజీ పడలేదు. మహాత్ముడు, సర్దార్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా దేశ నిర్మాణంలో ఈ ఎనిమిదేళ్లు నిజాయతీగా కృషి చేశాం. దేశ ప్రజలు సిగ్గుతో తలవంచుకునేలా చేసే ఏ పనిని అనుమతించలేదు’ అని వెల్లడించారు. ఈ సందర్భంగా వంశపారంపర్య రాజకీయాలు చేస్తోన్న పార్టీలపై విమర్శలు గుప్పించారు. అలాగే యూపీఏ పాలనను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా విమర్శలు చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండాల్సిన అవశ్యకతను వెల్లడించారు.





