
హిందువులను దోచుకోడానికి ఎన్నో రకాల మార్గాలను కేటుగాళ్లు అన్వేషిస్తూ ఉంటారు. ఇక హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వైష్ణోదేవి ఆలయం విషయంలో కూడా మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడం వ్యయ, ప్రయాసలతో కూడుకున్నది. కొందరు హెలికాఫ్టర్లలో వెళుతూ ఉంటారు. తాజాగా వైష్ణోదేవి ఆలయం పేరు చెప్పి కొందరు మోసగాళ్ళు చేస్తున్న నకిలీ హెలికాప్టర్ టిక్కెట్ల దందా బయటపడింది. నకిలీ హెలికాప్టర్ టిక్కెట్లను విక్రయించడం ద్వారా వైష్ణో దేవి యాత్రికులను మోసగిస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను ఛేదించినట్లు పోలీసులు తెలిపారు.
సైబర్ పోలీసులు, జమ్మూ, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో నలుగురిని రాజస్థాన్లోని కోటాలో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డుకు చెందిన హెలీ సర్వీస్ ప్రొవైడర్లమని చెబుతూ పలువురు యాత్రికులను వీరు మోసం చేశారు. ఈ నెల ప్రారంభంలో, పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకునే యాత్రికులకు హెలికాప్టర్ టిక్కెట్లను అందజేస్తున్న నకిలీ ఆన్లైన్ సైట్లపై ఫిర్యాదులు రావడంతో అధికారులు వారిపై నిఘా ఉంచారు. చిన్న పాటి క్లూల ఆధారంగా ముఠాను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
మోసగాళ్లను పట్టుకోవడానికి సైబర్ విభాగం జమ్మూ పోలీసు సూపరింటెండెంట్ నరేష్ సింగ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రాజస్థాన్ కు పంపినట్లు ఆయన తెలిపారు. సునీల్ చావ్లా, దీపక్, గజానంద్, మోను పంకజ్లను అరెస్టు చేసినట్లు అధికార ప్రతినిధి తెలిపారు. పోలీసు బృందం వారి మోసాలకు సంబంధించిన సాక్ష్యాలను కూడా స్వాధీనం చేసుకుంది. ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తరువాత, తదుపరి విచారణ కోసం వారిని జమ్మూకు తీసుకువచ్చింది.





