News

ఇస్లాం పేరిట‌ ఉగ్ర‌వాదుల మార‌ణ‌ హోమం!

711views
  • నాశ‌నమ‌వుతున్న భార‌త యువ‌త‌రం

  • మానవత్వమే పెద్ద మతం…

  • క్షేమంగా ఉండటమే నిజమైన జిహాద్..

  • త‌ల్లి ఒడికి చేరిన భ‌ర‌త‌మాత బిడ్డ, హతమైన హిజ్బుల్ ఉగ్రవాది భార్య ర‌జియా బీబీ మ‌న‌సులో మాట‌

శ్రీనగర్(జమ్మూ కాశ్మీర్): పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు ఇస్లాం పేరుతో కాశ్మీర్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, కుటుంబాలు, పిల్లల జీవితాలను అంధకారంలోకి నెట్టాయని హతమైన హిజ్బుల్ ఉగ్రవాది భార్య రజియా బీబీ ఆరోపించారు.

రజియా బీబీ జమ్మూ కాశ్మీర్‌లోని బందిపొరా ప్రాంతంలో జన్మించింది. చిన్న వయస్సులోనే పాకిస్తాన్‌కు తీసుకెళ్లబడింది. అక్కడ ఆమెకు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదితో వివాహమైంది. అయితే, 2018లో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద కార్యకలాపాల్లో ఆమె భర్త మరణించడంతో ఆమె దాంప‌త్య జీవితం స్వల్పకాలికంగా మిగిలిపోయింది.

రజియా బీబీ ఇటీవల తన పిల్లలతో భారతదేశానికి తిరిగి వచ్చింది. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశానికి తిరిగి రావడం.. తాను తీసుకున్న ఉత్తమ నిర్ణయంగా పేర్కొంది.

“నా భర్త చనిపోయిన తర్వాత, వారు(హిజ్బుల్ ముజాహిదీన్) ఒక సంవత్సరం పాటు డబ్బు ఇచ్చారు. కానీ, తరువాత ఆ సాయం నిలిచిపోయింది. దీంతో నాకు ఇల్లు నడపడం కష్టంగా మారింది. నేను డబ్బు సంపాదించడానికి ఇతరుల ఇళ్ళ‌ల్లో ప‌నిమ‌నిషిగా చేరాను. కొన్ని రోజులు మా కుటుంబం ప‌స్తులతో గ‌డిపింది. ఇది మాకు చాలా కష్టమైన సమయం. నేను.. నా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నిద్ర‌పోని రాత్రుళ్ళు ఎన్నో గ‌డిపాను. నా కుటుంబం అనుభవించిన బాధలను ఎవరూ ఎప్పుడూ అనుభ‌వించ‌కూడ‌ద‌ని నేను చెప్పాలనుకుంటున్నాను”అని ఆమె చెప్పింది.

‘‘కొన్ని నెలలుగా డబ్బు లేకపోవడంతో పాకిస్థాన్‌ను వదిలి భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను. స్నేహితుల సాయంతో పాస్‌పోర్టు తయారు చేసుకుని నేపాల్ సరిహద్దుల మీదుగా భారత్‌కు వచ్చాను. మేము న్యూ ఇస్లామాబాద్‌ నుంచి ఖతార్‌కి, ఆపై ఖతార్ నుంచి ఖాట్మండుకు విమానాల్లో ప్రయాణించాం. ఖాట్మండు నుండి మేము ఢిల్లీ, తరువాత శ్రీనగర్ చేరుకున్నాము. శ్రీనగర్ చేరుకోగానే నేను మా నాన్నకు ఫోన్ చేసాను” అని ఆమె చెప్పింది. విచారణ కోసం కాశ్మీర్‌లోని పోలీస్ స్టేషన్‌లో నాలుగు రోజులు ఉండాల్సి వచ్చిందని రజియా బీబీ తెలిపింది.

“మొదట్లో, నేను చాలా భయపడ్డాను. మాకు ఏమి జరుగుతుందో అని ఆలోచించాను… అయితే, పోలీసు సిబ్బంది నన్ను, నా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్నారు. వారు మేము పోలీసు స్టేషన్లో ఉన్నాము అనే అనుభూతిని మాకు ఇవ్వలేదు. భారత ఆర్మీ సిబ్బంది ప్రవర్తన చాలా బాగుంది. నేను భారతదేశానికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది” అని ఆమె చెప్పింది.

“పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాద సంస్థలు ఇస్లాం పేరుతో భార‌త్‌లోని యువతను తప్పుదారి పట్టించి తీవ్రవాదం వైపు నెట్టివేస్తున్నాయి..,” అని ఆమె ఆరోపించారు. యువ‌త‌కు తప్పుడు వాగ్దానాలు చేసి, రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు. వారి మరణానంతరం బాధిత కుటుంబాలను ప‌ట్టించుకోవడం లేదన్నారు.

“భారత్ నుండి వచ్చిన వారిని వారు(పాకిస్తాన్) స‌రిగ్గా చూసుకోరు. వారు నా భర్తను చంపడానికి పంపారు. ఉగ్ర‌వాదులు యువ‌త‌ను వారి కుటుంబాలకు చెప్ప‌కుండా గుట్టుగా చేర్చుకుంటారు. కొన్నిసార్లు చేర్చుకున్న‌వారిని మూడు-నాలుగు రోజుల్లో తిరిగి వ‌చ్చేస్తార‌ని చెబుతుంటారు… కానీ, వారు ఇక తిరిగి రారు. తుపాకులు పట్టుకోవద్దని ప్రజలను కోరుతున్నాను. కుటుంబాలను నాశనం చేయవద్దని హిజ్బుల్ ముజాహిదీన్‌కు నేను చెప్పాలనుకుంటున్నాను” అని రజియా బీబీ అన్నారు.

తాను భారత్‌కు తిరిగి రావడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నానని, అయితే, పాకిస్థాన్‌లో చాలా మంది యువతులు, చిన్నారులు నిరాశా నిస్పృహలతో జీవిస్తున్నారని ఆమె అన్నారు. హతమైన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆహారం, బట్టలు, మందులు లేవని ఆమె అన్నారు.

“ఉగ్రవాద సంస్థలకు చెందిన యజమానులు హాయిగా ఉంటున్నారు. కానీ, నా భ‌ర్త‌ను రిక్రూట్‌మెంట్స్‌కు పంపారు. నా భర్త తన కుటుంబాన్ని అనాథ‌గా మిగిల్చాడు. యువత ఇటువంటి ద్రోహుల‌ వల్ల తప్పుదారి పట్టి, త‌న‌ కుటుంబాలను శోక‌సంద్రంలో ముంచుతోంది.. నాకు మానవత్వమే పెద్ద మతం… కుటుంబం, పిల్లలతో క్షేమంగా ఉండటమే నిజమైన జిహాద్ అని నేను నమ్ముతున్నాను” అని రజియా బీబీ అన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి