News

సనాతన సాంప్రదాయాలను కాలరాయడమే కాకుండా.. తప్పుడు జాబితా ఇస్తారా? కేరళ ప్రభుత్వ తీరుపై సర్వత్రా పెల్లుబుకుతున్న ఆగ్రహం.

491views

శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలు ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తర్వాత ఎంత మంది అయ్యప్ప సన్నిధానంలోకి ప్రవేశించారు…? అన్న అంశం చర్చనీయాంశమైంది. మూడు నెలల్లో అయ్యప్ప దర్శనం చేసుకున్న మహిళల జాబితాను కేరళ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానానికి అందించింది. అయితే… ఈ జాబితాపై అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

 శబరిమల ఆలయంలోకి గత 3 నెలలుగా ప్రవేశించిన మహిళల జాబితాను కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అందించింది. మొత్తం 51 మంది మహిళలతో కూడిన జాబితాను కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కౌన్సెల్ కోర్టు ముందు ఉంచింది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి యాభై ఒక్క మంది వెళ్లినట్లు పేర్కొంది. అంతేకాదు… సర్వోన్నత న్యాయస్థానం తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని.. తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.
 మరోవైపు… పినరాయి విజయన్ సర్కార్ సుప్రీంకోర్టుకు సమర్పించిన జాబితాపై హిందూ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ 51 మంది జాబితాలో అందరూ 10 నుంచి 51 ఏళ్లలోపు వారు కారని పేర్కొంటున్నాయి. అంతేకాదు.. తప్పుడు జాబితా ఇచ్చి సర్వోన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవపట్టిస్తోందని పినరాయి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పవిత్ర శబరిమల అయ్యప్ప సన్నిధానంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ… గతేడాది సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో కొంతమంది యువతులు పోలీసు రక్షణ వలయంలో ఆలయ ప్రవేశం చేసేందుకు ప్రయత్నించారు. అయితే… వీరిని అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. కాగా.. జనవరి 2వ తేదీన బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు సన్నిధానంలోకి ప్రవేశించారన్న వార్త బయటికి పొక్కింది. దీన్ని కేరళ సర్కార్ కూడా ధృవపరిచింది. ఆ తర్వాత ఒకళ్లిద్దరు మహిళలు ఆలయ ప్రవేశం చేశారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే… ఇప్పుడు కేరళ ప్రభుత్వం సమర్పించిన జాబితాలో 51 మంది పేర్లు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పలువురు అంటున్నారు.
అటు.. శ్రీలంక నుంచి వచ్చిన శశికళ అనే యువతి కూడా ఆలయ ప్రవేశం చేసేందుకు యత్నించింది కానీ.. భక్తులు ఆమెను అడ్డుకున్నారు. అయితే… ఈమె పేరు కూడా కేరళ ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో ఉంది. దీంతో కర్నాటక, ఎపీ, తమిళనాడుల నుంచి ఆలయ ప్రవేశానికి వచ్చి భంగపడ్డ మహిళల పేర్లను సన్నిధానాన్ని దర్శించుకున్న జాబితాలో చేర్చేంది పినరాయి విజయన్ సర్కార్. సనాతన సంప్రదాయాలను కాలరాయడమే కాకుండా సుప్రీంకోర్టుకు తప్పుడు జాబితా ఇచ్చి సమస్యను పక్కదారి పట్టిస్తోందని ధ్వజమెత్తుతున్నారు.
 ఇదిలా ఉండగా… యువతులు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తు.చ తప్పమంటూ కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు ఎవరైనా మహిళలు కోరితే… భారీ రక్షణ వలయం కల్పిస్తామని హామీలిచ్చింది. దీంతో పినరాయి విజయన్ సర్కార్ తీరుపై ఆగ్రహం పెల్లుబికింది. యువతుల ఆలయ ప్రవేశం, పినరాయి విజయన్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు, అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు నిరసన బాట పట్టాయి. కేవలం భక్తుల నిరసన గళంతో కేరళలతో పాటు యావత్ దేశం అట్టుడికిపోయింది.
Source : భారత్ టుడే
https://www.bhaarattoday.com/news/national/story/30310.html