
అమెరికా ఈశాన్య రాష్ట్రం కెంటకీలో టోర్నడో కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరింత పెరిగింది. పెనుగాలులతో కూడిన ఈ తుపాను ధాటికి సుమారు 70 మంది మరణించారు. రాష్ట్రంలో సుమారు 200 మైళ్ల మేర పలు కౌంటీలను బలమైన టోర్నడో చుట్టేసిందని, కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైనదని పేర్కొన్నారు. మృతుల సంఖ్య 100 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో అనేక అపార్ట్ మెంట్లు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని కర్మాగారాలు కూలిపోయాయి. రహదారులపై శిథిలాలు పడి ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. టోర్నడో ప్రభావం ఆరు రాష్ట్రాలపై పడింది. ఇల్లినోయీలో అమెజాన్ గిడ్డంగి పైకప్పు ఎగిరిపోయి, భారీ గోడ కూలిపోయింది. అలాస్కాలో ఓ నర్సింగ్ హోం దెబ్బతింది. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్, టెన్నెసీలపైనా టోర్నడో విరుచుకుపడింది. విద్యుత్తు సరఫరా స్తంభించిపోయి దాదాపు 3 లక్షలమంది అంధకారంలో చిక్కుకుపోయారు. అత్యవసరమైతే తప్పిస్తే బయటకు రావద్దని పలుచోట్ల అధికారులు విజ్ఞప్తి చేశారు. దేశాధ్యక్షుడు జో బైడెన్ తాజా పరిస్థితిని సమీక్షించారు.





