
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన వైద్యుడు అనిల్ మేనన్ అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)లో వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఉన్నారు. భవిష్యత్లో చేపట్టబోయే అంతరిక్ష యాత్రల్లో పాల్గొంటారు. ఆయనతోపాటు మరో తొమ్మిది మంది కూడా వ్యోమగాములుగా ఎంపికయ్యారు. మొత్తం 12వేల మంది దరఖాస్తుదారుల నుంచి వీరిని ఎంపిక చేశారు.
హ్యూస్టన్లోని ఎల్లింగ్టన్లో జరిగిన ఒక కార్యక్రమంలో నాసా అధిపతి బిల్ నెల్సన్ వీరిని పరిచయం చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి వీరికి శిక్షణ మొదలవుతుంది. అనంతరం వీరు వాణిజ్య కంపెనీల వ్యోమనౌకల్లో ఐఎస్ఎస్కు వెళ్లి, విధులు నిర్వర్తిస్తారు. నాసాకు చెందిన ఒరాయన్ వ్యోమనౌక, స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్లో చంద్రుడిపైకి, సుదూర అంతరిక్ష యాత్రలకు వీరు పయనమవుతారు.
మేనన్ (45) మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపొలిస్లో జన్మించారు. ఆయన తండ్రి అచన్ది కేరళలోని మలబార్ ప్రాంతం. తల్లి ఉక్రెయిన్ నుంచి వలస వచ్చారు. మేనన్ గతంలో స్పేస్ఎక్స్ వ్యోమనౌకకు తొలి ఫ్లైట్ సర్జన్గా వ్యవహరించారు. నాసా తరఫున ఐఎస్ఎస్కు పంపిన అనేక యాత్రలకూ సేవలు అందించారు. అమెరికా వాయుసేనలో అత్యవసర వైద్య విభాగంలో ఫిజీషియన్గా పనిచేస్తున్నారు. 2010లో హైతీ, 2015లో నేపాల్ భూకంపాల సమయంలో ఆయన వైద్య సేవలు అందించారు. తన హృదయంలో కేరళకు ప్రత్యేక స్థానం ఉందని మేనన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Source: EtvBharat




