
ప్రతీ ఏడాది నూతన సంవత్సర ప్రారంభం రోజున తిరుమల ప్రముఖులు..భక్తుల తో కిక్కిరిసి పోతుంది. అటువంటి తిరుమలలో ఈ సారి రద్దీ సాధారణంగా కనిపిస్తోంది. ప్రముఖలు తాకిడి తగ్గింది. అధికారులు అన్ని రకాలుగా ఏర్పట్లు చేసినప్ప టికీ…కొందరు పండితుల ప్రవచనాలు మరియు కరపత్రాలు, పుస్తకాలు, సోషల్ మీడియా సాధనాల సాయంతో జాతీయ వాదులు దశాబ్దాలుగా సాగించిన ప్రచారం ఫలితంగా సాధారణ భక్తుల మీద ప్రభావం పడినట్లు కనిపిస్తోంది. సాధారణంగా జనవరి 1న భక్తులతో కిక్కిరిసిపోయే తిరుమల గిరులు సాధారణంగా దర్శనమిస్తున్నాయి. జనవరి 1వ తేదీ ఆంగ్ల నామ సంవత్సరమని..ఆ రోజు కొత్త సంవత్సరాది గా జరుపుకోవటం సాంప్రదాయం కాదని పలువురు పండితులు చెబుతూ వచ్చారు. అంతే కాకుండా దశాబ్దాలుగా ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ తదితర సంస్థల కార్యకర్తల కృషి, ప్రచార ఫలితం ఈ ఏడాది జనవరి 1 వేడుకలపై పడినట్టు కనిపిస్తోంది. ప్రతి ఏడాది లాగే తిరుమల నూతన సంవత్సర వేడుకలకు తిరుమల శ్రీవారి ఆలయం ఘనంగా ముస్తాబైంది. ఆలయ ప్రాకారం, గోపురాలు, ధ్వజ స్తంభం, అంతరాలయాలను పూలు, విద్యుద్దీపాలతో టీటీడీ సిబ్బంది అందంగా అలంకరించింది. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సోమవారం అర్ధరాత్రి స్వామివారికి తిరుప్పావై పఠనం అనంతరం ఇతర కైంకర్యాలు పూర్తిచేసి.. మంగళవారం వేకువజామున 1.30 గంటల నుంచే వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించింది. వేకువజామున 4.30 గంటల నుంచి ధర్మదర్శనాన్ని మొదలుబెట్టి అర్ధరాత్రి వరకు సామాన్య భక్తులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. కానీ తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం ఎనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నూతన సంవత్సరం ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. అయితే, రోజులు..వారాలతో సంబంధం లేకుండా నిత్యం భక్త కోటితో పులకరించే శ్రీ వారి దేవాలయం..కొంత మేర జనం తగ్గినా..ప్రత్యేక రూపుతో మాత్రం భక్తులను అలరిస్తోంది.
Source: One India





