
-
చైనా డాంగ్ ఫ్ంగ్ క్షిపణికి పోటీగా ప్రయోగం
భువనేశ్వర్: చైనా వద్ద ఉన్న 12వేల నుంచి 15వేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే డాంగ్ఫెంగ్-41 క్షిపణికి పోటీగా అణ్వాయుధ సామర్ధ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా భారత్ అగ్ని-5ను అభివృద్ధి చేసింది. 17 మీటర్ల పొడవుండే అగ్ని-5 క్షిపణి 1.5 టన్నుల వార్హెడ్లను మోసుకువెళ్లగలదు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్ధ డీఆర్డీఓ దీనిని అభివృద్ధి చేసింది.
ఘన ఇంధనంతో మూడు దశల్లో పని చేసే ఇంజన్ సాయంతో ఇది ముందుకు సాగుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. చైనాకు మరింత సవాల్ విసిరేలా 5వేల కిలోమీటర్ల లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి బుధవారం రాత్రి ఏడు గంటల 50 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని జరిపింది.
ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు. అగ్ని-5 ఖండాంతర క్షిపణి ప్రాజక్టు పని దశాబ్దం క్రితం ప్రారంభం కాగా, దీనిని ఏడు సార్లు ప్రయోగించారు. ఇప్పటికే భారత సైన్యంలో మోహరించిన అగ్ని-1 నుంచి అగ్ని-4 శ్రేణి క్షిపణులు 7వందల నుంచి 3వేల 5వందల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యాన్ని కల్గి ఉన్నాయి.





