
పది సంత్సరాల క్రితం 2008 ఆగష్టు 23న ఒడిషా రాష్ట్రంలోని కొంధమాల్ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ హిందూ ధర్మాచార్యుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఆయన ముఖ్య శిష్యులపై మతోన్మాదులైన సాయుధ ముష్కరులు తుపాకులు, గండ్ర గొడ్డళ్ళతో దాడిచేసి క్రూరంగా హత్యచేశారు. దానికి కారణం ఆ స్వామీజీ ధర్మాచార్యునిగా తన కర్తవ్యాన్ని రాజ్యాంగబద్ధంగా, అహింసాయుతంగా నిర్వహించడం! అమాయకులైన వనవాసులను (ఎస్.టి.) స్థానిక క్రైస్తవ మిషనరీలు మతం మార్చడం, వారి హక్కులను హరించడం వంటి ఆగడాలకు పాల్పడేవారు. వారి గోసంపదను కబేళాలకు (పశువధశాలలకు) తరలించడం, స్థానిక పండుగలు శ్రీరామనవమి, జగన్నాథ రథయాత్ర వంటి వాటిని అడ్డుకోవడం నిత్యకృత్యంగా మారింది. స్థానిక కాంధ్ తెగకు చెందిన వనవాసులు క్రైస్తవులు చేస్తున్న ఈ ఆగడాలకు తాళలేక స్వామి లక్ష్మణానంద నేతృత్వంలో వారిపై తిరగబడ్డారు. ప్రజా ప్రయోజనాలను కాపాడవలసిన బాధ్యత గల పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి మిషనరీలకూ, పశువుల అక్రమ రవాణాకు పాల్పడే స్మగ్లర్లకూ వంత పాడేవారు.
ఈ పరిస్థితుల్లో హిందూ ధర్మ పరిరక్షణకు, వనవాసుల కనీస మానవ హక్కుల పరిరక్షణకు నడుం బిగించిన స్వామి లక్ష్మణానంద జిల్లాలోని గ్రామ గ్రామాన పర్యటిస్తూ ధర్మపరిరక్షణ సమితులను ఏర్పాటు చేయటం, రకరకాల ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞాలు, ధార్మిక ఉపన్యాసాలు నిర్వహిస్తూ హిందువులలో ఐక్యతనూ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. ఒడిషా రాష్ట్రంలో పూరీ జగన్నాథ రథ యాత్ర ప్రతి గ్రామంలో జరపటం ఆనవాయితీ. మతమార్పిడి వ్యాపారంలో ఆరితేరిన క్రైస్తవ చర్చి, దాని ప్రేరితమైన కొందరు అధికారులు, గూండాలు చాలా గ్రామాల్లో ఈ ఉత్సవాన్ని అడ్డుకున్నారు. స్వామీజీ పిలుపు మేరకు హిందుత్వ వాదులైన యువత ముందుకు వచ్చి అనేక గ్రామాల్లో భారీ ఎత్తున జగన్నాథ రథ యాత్రను పునః ప్రారంభించారు. అంతకుముందు ‘రథయాత్రకు అనుమతి లేదు. మా ఆజ్ఞలను ధిక్కరిస్తే కాల్పులు జరుపుతాం’ అన్న పోలీసులు జగన్నాథ రథాలతోపాటు ముందుకు కదిలిన జనసముద్రాన్ని చూసి తోక ముడిచారు.

స్వామి లక్ష్మణానంద గొప్ప మానవతావాది, సమాజ సేవకుడు. అనాథ బాలికల కోసం అనాథ శరణాలయాలను నడిపేవారు. సంస్కృత భాషా పరిరక్షణకు ప్రత్యేక కృషి చేశారు. గో సంపద ప్రాముఖ్యతను స్థానిక వనవాసులకూ, గ్రామస్థులకూ కూలంకషంగా వివరించేవారు. కాంథ్ వనవాసులకు ఆయన ఏకైక దిశానిర్దేశకుడుగా గురువుగా, రక్షకునిగా మారారు. తమ గోడును చెప్పుకునేందుకు ఆయనే తమకు దిక్కని వారు భావించేవారు. మతం మారిన అనేక వనవాసీ హిందూ కుటుంబాలను నచ్చచెప్పి తిరిగి హిందూధర్మంలోకి స్వామీజీ పునరామగనం చేయించేవారు. దాంతో చాలా చోట్ల చర్చిలు మూతపడ్డాయి. క్రైస్తవ మిషనరీల మాటలలోని అంతరార్థాన్నీ, ‘సేవ’ పేరుతో వారు చేస్తున్న మోసాన్నీ స్వామీజీ విపులంగా వివరించేవారు. ఆ అవగాహనతో అంతకుముందు మతం మారినవారు తిరిగి హిందూ ధర్మంలోకి తిరిగివచ్చేవారు. ఈ పరిస్థితి కొనసాగితే తమ మతమార్పిడి వ్యాపారం సాగదనీ, ఒడిషా రాష్ట్రంలో తమ మతం అంతమవుతుందని గ్రహించిన క్రైస్తవ మిషనరీలు స్వామీజీపై దాడులు చేయించడం ప్రారంభించారు. ఫోన్చేసి చంపుతామని బెదిరించేవారు. అనేకసార్లు ఆయన ప్రాణాపాయ కరమైన భౌతిక దాడులకు గురయ్యి, గాయపడి తృటిలో మృత్యువు నుండి తప్పించుకున్నారు కూడా. అయినా ఆత్మదర్శనం కావించి సర్వసంగ పరిత్యాగం చేసిన స్వామీజీ ఇలాంటి బెదిరింపులకు భయపడలేదు. దాడులకు వెరవలేదు. ‘ప్రాణం కాపాడుకోవడం కంటే, ధర్మాన్ని కాపాడడమే ప్రధానం’ అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగారు. దాంతో దుండగులు అసహనంతో ఆగష్టు 23, 2008న ఆయనపై కాల్పులు జరిపి, గొడ్డళ్ళతో నరికి హత్య చేశారు. వారు స్వామీజీని హత్య చేయగలిగారు కానీ, ఆయన ఆశయాన్నీ దాని వెనుక ఉన్న ప్రబల శక్తినీ కాదు. ఈ ముక్తునికి నివాళి అర్పిద్దాం.





