
దేశంలో మరో అతిపెద్ద డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ₹2,500 కోట్లు విలువచేసే 354 కిలోల హెరాయిన్ను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ముంబయి నుంచి వచ్చిన ఓ కంసైన్మెంట్ను తనిఖీ చేయగా భారీ మొత్తంలో హెరాయిన్ బయటపడింది. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారి నీరజ్ ఠాకూర్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఈ మాదకద్రవ్యాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి ముంబయి మీదుగా ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ను దాచేందుకు ఈ ముఠా ఫరీదాబాద్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారని.. అక్కడి నుంచి వీటిని పంజాబ్తోపాటు మరికొన్ని ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమైనట్లు నీరజ్ పాండే పేర్కొన్నారు. నిందితుల్లో ముగ్గురు హరియాణాకు చెందినవారు కాగా మరొకరు ఢిల్లీ వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ ముఠాకు పాకిస్థాన్తో కూడా సంబంధాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.







