News

ఢిల్లీ అవసరాలకు మించి నాలుగు రెట్లు ఎక్కువగా ఆక్సిజన్ అడిగింది : ఆడిట్ కమిటీ వెల్లడి

619views

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్ వినియోగంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆడిట్‌ కమిటీ కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. ఢిల్లీ ప్రభుత్వం తన అవసరాలకు మించి నాలుగు రెట్లు ఎక్కువగా ఆక్సిజన్ ‌ను కోరినట్లు తేల్చింది. ఏప్రిల్‌-మే నెలల్లో ఆక్సిజన్‌ సరఫరాలో విపరీతమైన కొరత ఏర్పడింది. దీంతో చాలా ఆస్పత్రుల్లో ప్రాణవాయువు అందక రోగులు కన్నుమూసిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ సమయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడంతో కేంద్రం ఢిల్లీకి ఆక్సిజన్‌ కేటాయింపులను పెంచింది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలకు కేటాయింపులను తగ్గించింది. తాజాగా వచ్చిన ఆడిట్‌ రిపోర్టు ప్రకారం అప్పట్లో ఢిల్లీకి నిత్యం 300 టన్నుల ప్రాణవాయువు అవసరం కాగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 1200 టన్నులు డిమాండ్‌ చేసింది. ఢిల్లీ అదనపు ఆక్సిజన్‌ తీసుకోవడంతో 12 రాష్ట్రాలు తీవ్ర కొరతను ఎదుర్కొన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఆక్సిజన్‌ ట్యాంకర్లను అన్‌లోడ్‌ చేయకుండా..

ఢిల్లీ భారీగా ఆక్సిజన్‌ కోరుతుండటంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, ఎం.ఆర్‌.షా ధర్మాసనం 12మంది నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ‌ను ఏర్పాటు చేసింది. ఇది ఆక్సిజన్‌ ఆడిట్‌ నిర్వహించింది. ఈ కమిటీ మే 13వ తేదీన ఢిల్లీ చేరుకొన్న చాలా ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఎక్కడా అన్‌లోడ్‌ చేయకుండా ఉంచేసినట్లు గుర్తించింది. అప్పటికే ఆస్పత్రుల్లోని ట్యాంకులు 75శాతం కంటే అదనంగా ఆక్సిజన్ ‌తో నిండి ఉన్నాయి. ఎల్‌ఎన్‌జేపీ, ఎయిమ్స్ ల‌లో ఆక్సిజన్‌ ట్యాంకర్లు పూర్తిగా నిండి ఉన్నట్లు గుర్తించింది.

టాస్క్ ‌ఫోర్స్‌ మరో భారీ లోపాన్ని కూడా గుర్తించింది. ఏప్రిల్‌ 29 నుంచి మే 10వ తేదీ మధ్యలో ఢిల్లీ ఆస్పత్రుల ఆక్సిజన్‌ వినియోగ లెక్కను సవరించాల్సి ఉందని పేర్కొంది. దీనిలో ఆస్పత్రులు ఇచ్చిన నివేదికలో చాలా లోపాలున్నాయని తెలిపింది. సవరించని నివేదిక ప్రకారం రోజు 1140 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం.. కానీ, సవరించిన లెక్కల ప్రకారం అది రోజుకు కేవలం 209 మెట్రిక్‌ టన్నులు మాత్రమే. కానీ ఢిల్లీ ప్రభుత్వం తన అవసరానికి మించి 4 రెట్లు అదనంగా ఆక్సిజన్ ను కోరింది.

ఢిల్లీ హైకోర్టు ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతటితో ఆగకుండా ఢిల్లీ ప్రభుత్వం కోరినంత ఆక్సిజన్ ను ఆ రాష్ట్రానికి సరఫరా చెయ్యాల్సిందేనని కేంద్రానికి హుకుం జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు కేటాయింపులను తగ్గించి, ఢిల్లీకి భారీగా ఆక్సిజన్ సప్లయ్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అవసరాలపై ఆడిట్ కమిటీ వేశాక “మాకు అంత ఆక్సిజన్ అవసరం లేదు, అదనంగా ఉన్న ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాలకివ్వండి” అంటూ తెగ ఉదారతను ప్రదర్శించింది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో వినియోగించినట్లు చెబుతున్న ఆక్సిజన్‌ లెక్కలకి వాస్తవంగా అందుబాటులో ఉన్న పడకల ఆధారంగా లెక్కిస్తే…. వినియోగంలో చాలా తేడా ఉన్నట్లు ఆడిట్‌ కమిటీ గుర్తించింది.

కమిటీ కీలక సూచనలు..

ఈ మొత్తం వ్యవహారాన్ని అధ్యయనం చేసిన ఆడిట్‌ కమిటీ కీలక సూచనలు చేసింది. భవిష్యత్తులో వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొంది.
* పెద్ద నగరాల అవసరాల్లో కనీసం 50శాతం ఆక్సిజన్‌ స్థానికంగా లేకపోతే చుట్టుపక్కల తయారు చేసుకొనేలా ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి.
* జనసాంద్రతను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ, ముంబయి నగరాలకు ఇది చాలా ముఖ్యం. 18 మెట్రో నగరాలు ఆక్సిజన్‌ కోసం ఇతరులపై ఆధారపడకుండా కనీసం 100 మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉంచుకొనేలా ఏర్పాట్లు చేసుకోవాలి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.