ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంటల కనీస మద్దతు ధరలను (MSP) కేంద్రం ఖరారు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బుధవారం జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో నూతన కనీస మద్దతు ధరలకు ఆమోదం లభించింది. 2021-22 మార్కెట్ సీజన్కు ఈ ధరలు వర్తిస్తాయి. కేబినెట్ సమావేశం అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సమావేశం వివరాలను వెల్లడించారు.
ధాన్యం క్వింటాకు రూ.72 మేర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.1868 ఇస్తుండగా.. ఇకపై రూ.1940 చెల్లించనున్నారు. ధాన్యంతో పాటు ఇతర పంటల ఎంఎస్పీని కూడా ప్రకటించారు. క్వింటా నువ్వులకు కనీస మద్దతు ధరను రూ.452 మేర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. క్వింటా కంది, మినముల కనీస మద్దతు ధరను కూడా రూ.300 మేర పెంచింది. క్వింటా జొన్నలకు ప్రస్తుతం రూ.2,150 ఇస్తుండగా.. దాన్ని రూ.2,250కి పెంచారు. భవిష్యత్లోనూ కనీస మద్దతు ధరలు కొనసాగుతాయని మంత్రి ప్రకటించారు.