
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో జరుగుతున్న టీకా పంపిణీ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి సహా సీనియర్ అధికారులు దీనిలో పాల్గొన్నారు. రాష్ట్రాలు, జిల్లాల్లో టీకా పంపిణీ కార్యక్రమం ఎలా సాగుతోంది. ఇప్పటి వరకు ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఏయే రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి ఉంది? వంటి అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్లు సమాచారం.
దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 93,249 కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్ తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్గఢ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచే 81.42 శాతం కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.