
అక్రమ చొరబాట్లకు పాల్పడుతున్న చైనాపై నిఘా, పర్యవేక్షణను మరింత పెంచేందుకు భారత్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తూర్పు లడ్డాఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్ద నౌకాదళానికి చెందిన మెరైన్ కమాండోలను మోహరించిందని తెలిసింది. ఆరు నెలలుగా అక్కడే గస్తీ కాస్తున్న వాయుసేన గార్డు కమాండోలు, భారత సైన్యం ప్రత్యేక పారామిటలరీ దళాలతో సమన్వయం కోసం వీరిని అక్కడికి పంపించారు. అంతేకాకుండా అక్కడి విపరీతమైన చలి, కఠిన వాతావరణానికి అలవాటు పడాలన్నది మరో ఆలోచనగా తెలుస్తోంది.
లడ్డాఖ్ ప్రాంతంలో మోహరించిన నేవీ కమాండోలకు త్వరలోనే కొత్త బోట్లు అందించనున్నారు. దీంతో వారు పాంగాంగ్ సరస్సులో గస్తీ ఆపరేషన్లు చేపడతారు. పారా మిలిటరీ దళాలు సుదీర్ఘ కాలంగా పర్వత సానువుల్లో ఆపరేషన్లు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక వాయుసేన కమాండోలు రక్షణ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. గల్వాన్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో దాదాపుగా ఆరు నెలల నుంచి త్రివిధ దళాలకు చెందిన జవాన్లు తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు వూలర్ ప్రాంతంలో మెరైన్ కమాండోలను మోహరించడం గమనార్హం.