
మరో శిరచ్ఛేదంతో ఫ్రాన్స్ దేశం మరోసారి ఉలిక్కిపడింది. ఇటీవల రాజధాని పారిస్లో ఓ ఉపాధ్యాయుడిని తల నరికి చంపగా.. తాజాగా నైస్ నగరంలో మరో ఘటన చోటుచేసుకుంది. స్థానిక నోట్రే డేమ్ చర్చి సమీపంలో గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఓ మహిళ తల నరికి అతి దారుణంగా హత్య చేశాడు. మరో ఇద్దరిని చంపేశాడు.
గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిని నగర మేయర్ క్రిస్టియన్ ఎస్త్రోసి ధ్రువీకరించారు. ఘటనలో ముగ్గురు చనిపోగా.. పలువురు గాయపడినట్లు తెలిపారు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా మేయర్ క్రిస్టియన్ పేర్కొన్నారు. అయితే దీనిపై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని పోలీసులు అంటున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
అక్టోబరు మొదటి వారంలో పారిస్లో శామ్యూల్ పాటీ అనే స్కూల్ టీచర్ను చెచెన్ సంతతికి చెందిన ఓ యువకుడు అతి దారుణంగా తల నరికి చంపాడు. పాఠం చెబుతున్నప్పుడు మహ్మద్ ప్రవక్త కార్టూన్లను చూపించాడని, అందుకు ప్రతీకారంగానే టీచర్ను హత్య చేసినట్లు సదరు యువకుడు విచారణలో తెలిపాడు. అయితే ప్రస్తుత నైస్ దాడికి కూడా ఇదే కారణమా అనే విషయం తెలియాల్సి ఉంది.





