
పుల్వామా ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్కు ఇప్పటికీ దాయాది పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తూనే ఉందని భారత్ ఆరోపించింది. పాక్కు సరైన ఆధారాలు సమర్పించినప్పటికీ అజార్కు ఆ దేశం మద్దతిస్తూనే ఉందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. 2008 ముంబయి దాడులకు పాల్పడిన వారిని వెనకేసుకొచ్చినట్లే అజార్ విషయంలోనూ పాక్ అలానే ప్రవర్తిస్తోందని భారత్ మండిపడింది.
155 మంది విమాన ప్రయాణికులను హైజాక్ చేసిన తర్వాత, వారిని విడిపించుకునే క్రమంలో భారత్ జైలు నుంచి విడుదలైన మసూద్ అజర్.. 2000లో జైషే మహ్మద్ ఉగ్రసంస్థను స్థాపించాడు. 2019 ఫిబ్రవరి 14లో పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇప్పటికే ఆరుగురు అదుపులో ఉండగా.. అజార్ ప్రధాన నిందితుడు. అతడి సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, మరణించిన ఉగ్రవాది మహ్మద్ ఉపర్ ఫరూఖ్, ఆత్మాహుతి దళ సభ్యుడు అదిల్ అహ్మద్ దార్, అల్వీ, ఇస్మాయిల్ తదితర పాక్ మూలాలున్న వారిపై ఇటీవల ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది.
పుల్వామాలో భద్రతా బలగాల వాహన శ్రేణిని పేలుడు పదార్థాలు నింపిన కారుతో ఢీకొన్న నాటి ఘటనలో 40 మందికి పైగా భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. దీనికి తామే బాధ్యులమని జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఈ ఉగ్ర సంస్థ పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది.





