
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుంది పాక్ అధికారుల తీరు. ఆ దేశ నాయకులు దేశాన్ని చైనాకు అమ్మేస్తుంటే.. రాయబారులు దౌత్యకార్యాలయాలను కారు చౌకగా విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో గుర్తించి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
పేపర్లో ప్రకటన ఇచ్చి మరీ..
పాకిస్థాన్కు చెందిన మేజర్ జనరల్ సయీద్ ముస్తఫా అన్వర్ ఇండోనేషియాలో రాయబారిగా పనిచేశారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో పాక్కు రాయబార కార్యాలయం ఉంది. దీన్ని 2001-2002లో విక్రయించేశారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ దెబ్బకు పాక్కు 1.3 మిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. అన్వర్ జకార్తాలో రాయబారిగా నియమించిన వెంటనే ఈ భవనంపై కన్నేశారు. దీనిని విక్రయించేందుకు అన్వర్ అప్పట్లో ఏకంగా పత్రికా ప్రకటనే జారీ చేశారు. వాస్తవానికి దీనిని విక్రయించాలంటే పాక్ విదేశాంగశాఖ అనుమతి ఉండాలి. వాస్తవానికి ఈ ప్రాసెస్ మొదలుపెట్టే ముందే అన్వర్ విదేశాంగ శాఖకు లేఖ రాశారు. దీనికి అనుమతి నిరాకరిస్తూ ఆ శాఖ అన్వర్కు పలు లేఖలు రాసింది. అయినా విక్రయాన్ని పూర్తి చేశారు.





