
20 మంది భారతీయ ఆర్మీ జవాన్లు అమరులు కావడానికి దారితీసిన భారత్-చైనా గాల్వన్ వివాదం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో మాట్లాడుతూ త్రివిధ దళాలకు పూర్తి అధికారాన్ని ఇస్తున్నట్లుగా చెప్పారు. కమాండర్లు పరిస్థితులకు అనుగుణంగా తగినట్లుగా వ్యవహరించడానికి మరియు ప్రతిస్పందించడానికి అనుమతి ఇస్తున్నట్లుగా పేర్కొనడం గమనార్హం. సిడిఎస్ జనరల్ రావత్ మరియు త్రివిధ దళాల అధిపతులతో జరిగిన సమావేశంలో రక్షణ మంత్రి భారతదేశం శాంతియుత దేశం అని పునరుద్ఘాటించారు. కానీ చైనా పదేపదే చేపడుతున్న దురాక్రమణ చర్యలు భారత సైన్యాన్ని శత్రువైన పొరుగువారితో చేసుకున్న సరిహద్దు ఒప్పందాలను మార్చుకునేలా చేస్తున్నాయన్నారు.
సరిహద్దు నియమాలలో మార్పు ప్రకారం సాయుధ దళాలు ఇకపై తుపాకీ వాడకంపై ఆంక్షలకు కట్టుబడి ఉండవు. పొరుగువారు శత్రువులుగా మారితే పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించే పూర్తి అధికారం దళాలకు ఉంటుంది.
రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియట్ రష్యా విజయం సాధించిన 75 వ వార్షికోత్సవం సందర్భంగా మాస్కోలో జరిగే భారీ సైనిక కవాతులో పాల్గొనడానికి సోమవారం నుండి మూడు రోజుల రష్యా పర్యటనకు వెళ్లనున్న రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ చైనాతో కొనసాగుతున్న వివాదానికి సంబంధించి రష్యాతో మాట్లాడతానని నొక్కిచెప్పారు. జూన్ 15-16 తేదీలలో భారతదేశం మరియు చైనా మధ్య సరిహద్దు వివాదం భారతీయ సైనికుల ప్రాణాలను బలిగొనడం మరియు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి కూడా భారీ ప్రాణనష్టం జరిగినందున ప్రస్తుతం రక్షణ మంత్రి పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది.





