
న్యూయార్క్, టొరంటో, లండన్ పర్యటనల వెనుక ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ఆలోచన ఏమిటి?
ఒక భావజాలాన్ని, ఒక సంస్థను, ఒక నాయకుడిని విమర్శించేందుకు అనేక మార్గాలు ఉంటాయి. ఆరోపణలు చేయడం, విశ్వసనీయతను ప్రశ్నించడం, ప్రత్యర్థి సిద్ధాంతాన్ని ఎగతాళి చేయడం వంటి పద్ధతులు రాజకీయ, సామాజిక చర్చల్లో తరచూ కనిపిస్తాయి. అయితే, ఇటువంటి విమర్శలు ఎంత తీవ్రంగా ఉన్నా.. వాటికి సమాధానం సంభాషణ ద్వారానే ఇవ్వాలనే దృక్పథం అవసరం.
ఇదే నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ చేపట్టిన పాశ్చాత్య దేశాల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్లలో ఆయన వివిధ వర్గాలతో సమావేశమై ‘విశ్వ ఏకత్వం’, సామాజిక సామరస్యం, ఆధ్యాత్మికత, కుటుంబ వ్యవస్థ, పౌర భాగస్వామ్యం వంటి అంశాలపై మాట్లాడనున్నారు.
న్యూయార్క్లో ‘విశ్వ ఏకత్వం’ సందేశం
అమెరికాలో నిర్వహించనున్న అంతర్మత సదస్సులో వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు, సామాజిక సంస్థలు, పౌర నాయకులు, హిందూ సమాజ ప్రతినిధులు పాల్గొననున్నారు. పశ్చిమ ఆసియా, తూర్పు ఐరోపాలో కొనసాగుతున్న యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మతాల మధ్య సంభాషణ, శాంతి, సామాజిక సమైక్యతను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలుస్తోంది.
ఈ వేదికపై మోహన్ భగవత్ ‘వసుధైవ కుటుంబకం’ అనే భారతీయ ఆలోచనను ప్రపంచానికి పరిచయం చేయడం ప్రాధాన్యత కలిగిన అంశంగా భావించవచ్చు. ప్రపంచం మొత్తం ఒక కుటుంబమనే భావన భారతీయ తాత్విక సంప్రదాయంలో ఎంతో పురాతనమైనది.
అయితే భగవత్ పర్యటనకు వ్యతిరేకంగా కొన్ని వర్గాల నుంచి విమర్శలు, నిరసనలకు పిలుపులు కూడా వినిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, హిందుత్వంపై ఉన్న అభ్యంతరాలను కొందరు ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విమర్శలకు ప్రతిస్పందనగా ఘర్షణకు బదులుగా సంభాషణను ఎంచుకోవడం ఈ పర్యటనకు మరో కోణాన్ని అందిస్తోంది.
స్వామి వివేకానందతో పోలిక ఎందుకు?
1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసిన చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.
మతాల మధ్య సహనం, పరస్పర గౌరవం, అంగీకారం వంటి విలువలను స్వామి వివేకానంద ప్రస్తావించారు. భిన్న విశ్వాసాలు ఉన్నప్పటికీ మానవత్వం అనే విస్తృత బంధంతో ప్రపంచాన్ని చూడాలనే ఆలోచన ఆయన సందేశంలో ప్రధానంగా కనిపించింది.
ఈ నేపథ్యంలోనే మోహన్ భగవత్ పర్యటనను కూడా కొందరు ‘భారతీయ ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రపంచ వేదికపై ప్రస్తావించే ప్రయత్నం’గా చూస్తున్నారు.
టొరంటో, లండన్లలోనూ కీలక సమావేశాలు
న్యూయార్క్ అనంతరం కెనడా, యునైటెడ్ కింగ్డమ్లలో కూడా భగవత్ పర్యటన కొనసాగనుంది. ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలు, సామాజిక నాయకులు, వివిధ మతాలకు చెందిన ప్రతినిధులతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు.
సిక్కు సమాజానికి చెందిన ప్రముఖులతో సమావేశాలు కూడా ఈ పర్యటనలో భాగంగా ఉండనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కెనడాలో హిందూ–సిక్కు సంబంధాలు, ఖలిస్తానీ అంశం, ప్రవాస భారతీయ సమాజంలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ అంశాలపై వివిధ వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. భారతీయ సమాజంలోని విభిన్న వర్గాలతో నేరుగా మాట్లాడటం ద్వారా అపోహలను తొలగించేందుకు అవకాశం లభిస్తుందని ఆర్ఎస్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సంస్థ గత వందేళ్ల ప్రస్థానం, సామాజిక సేవా కార్యక్రమాలు, భారతీయ నాగరికతపై దాని దృక్పథం వంటి అంశాలను ప్రపంచానికి వివరించేందుకు సంస్థ నాయకత్వం ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఆధ్వర్యంలో నాగరికతా సంభాషణకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మోహన్ భగవత్ పర్యటన కూడా ఈ విస్తృత సంభాషణలో భాగంగానే చూడవచ్చు.
ఆర్ఎస్ఎస్పై, హిందుత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపోహలను తొలగించడంతో పాటు.. సంస్థ భవిష్యత్ దిశపై కూడా భగవత్ తన ప్రసంగాల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
పాశ్చాత్య ప్రపంచీకరణకు భిన్నమైన భారతీయ దృష్టికోణమా?
ఆధునిక ప్రపంచీకరణ ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలు, ఉత్పత్తి, వినియోగం, సాంకేతికత, మార్కెట్ల విస్తరణ చుట్టూ అభివృద్ధి చెందింది. అయితే భారతీయ ఆలోచనా సంప్రదాయం ప్రపంచ అనుసంధానాన్ని కేవలం ఆర్థిక కోణంలో చూడదు.
ఆధ్యాత్మిక ఏకత్వం, మానవ విలువలు, ప్రకృతితో సమన్వయం, కుటుంబ వ్యవస్థ, సామాజిక బాధ్యత వంటి అంశాలను కూడా ప్రపంచ అభివృద్ధిలో భాగంగా పరిగణిస్తుంది.
‘వసుధైవ కుటుంబకం’ అనే భావన ఈ దృక్పథానికి ప్రతీక. సాంకేతిక అభివృద్ధి, ఆర్థిక పురోగతితో పాటు మానవ సంబంధాలు, నైతిక విలువలు, ఆధ్యాత్మికతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఈ ఆలోచనలోని ప్రధాన సందేశం.
విమర్శలకు సమాధానం.. సంభాషణతోనే
మోహన్ భగవత్ పర్యటనపై విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ.. వాటికి సమాధానం చెప్పేందుకు ఆయనకు లభిస్తున్న ప్రపంచ వేదిక కూడా అంతే ముఖ్యమైనది.
ఆర్ఎస్ఎస్ను విమర్శించే వారికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉన్నట్లే.. ఆర్ఎస్ఎస్ తన ఆలోచనలను ప్రపంచానికి వివరించే హక్కు కూడా ఉంది. ఆ రెండు మధ్య సంభాషణకు అవకాశం కల్పించడమే ప్రజాస్వామ్య విలువలకు అనుగుణమైన మార్గం.
విభజన, యుద్ధాలు, మతపరమైన ఉద్రిక్తతలు, సామాజిక అసమానతలతో ప్రపంచం సతమతమవుతున్న సమయంలో ‘ప్రపంచం ఒక కుటుంబం’ అనే భారతీయ సందేశం ఎంతవరకు ప్రభావం చూపగలదో మోహన్ భగవత్ పర్యటన ద్వారా చూడాల్సి ఉంటుంది.
విమర్శలు, వ్యతిరేకతలు తమ స్థానంలో ఉన్నప్పటికీ.. ప్రపంచ వేదికపై భారతీయ నాగరికత, హిందూ తాత్విక సంప్రదాయం, ‘వసుధైవ కుటుంబకం’ వంటి భావనలపై జరిగే సంభాషణకు ఈ పర్యటన ఒక కొత్త అవకాశాన్ని తెరుస్తుందనడంలో సందేహం లేదు.
ఇప్పుడు వినాల్సింది ఆయన మాటలే.
— కె.ఎ. బద్రీనాథ్, రచయిత సీనియర్ జర్నలిస్ట్.
న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ స్టడీస్’కు డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు.




